ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్.. ఇవాళ ఆయనతో సమావేశమయ్యారు. రైతులు, చైనా, రాజకీయాలు వంటి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు. ఈ వీడియోని రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. తన తండ్రి కాంగ్రెస్కు చెందిన వ్యక్తి అని, తాను టీనేజ్ లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీని విమర్శించేవాడినని, ఏళ్లు గడిచే కొద్ది ఆయనపై అభిమానం పెరిగిందని కమల్ తెలిపారు. మహాత్మాగాంధీకి క్షమాపణ చెప్పాలనే ఆలోచన వల్లే హే రామ్ అనే చిత్రాన్ని తీసినట్లుగా ఈ సందర్భంగా కమల్ వెల్లడించారు. అలాగే మత సామరస్యం గురించి కమల్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలతో కలిసిన సమాజమే అభివృద్ధి చెందుతుందని అంతా అర్థం చేసుకోవాలని సూచించారు.
చైనా... రష్యా వైఖరినే ఫాలో అవుతోంది : రాహుల్ గాంధీ
ఉక్రెయిన్పై రష్యా వ్యవహరించిన తీరునే భారత్తో చైనా అవలంబిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. "పాశ్చాత్య దేశాలతో బంధం పెంచుకోవాలని చూస్తే ఉక్రెయిన్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తామని రష్యా హెచ్చరించింది. చైనా కూడా అంతే. భారత్ జాగ్రత్తగా వ్యవహరించకుంటే లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లను ఆక్రమిస్తాం అంటోంది" అని అన్నారు.