
- ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే ప్రదర్శన అయిన 16వ ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్(ఐఆర్ఈఈ), ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్(ఐఆర్సీ) బుధవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
మూడు రోజుల (అక్టోబర్ 15 నుంచి 17 వరకు)పాటు కార్యక్రమం జరగనుంది. ఇందులో ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ సహా మొత్తం 14 దేశాల నుంచి 20 వేలకు పైగా పరిశ్రమ నిపుణులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ..‘‘గడిచిన11 ఏండ్లల్లో దాదాపు 35 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్లు నిర్మించాం. 46 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు విద్యుదీకరించాం. 156 వందే భారత్ ఎక్స్ప్రెస్లు, 30 అమృత్ భారత్, 4 నమో భారత్ సర్వీసులు నడుపున్నాం’’ అని పేర్కొన్నారు.