- ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- పిడుగులు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని మంగళవారం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురవొచ్చని చెప్పింది.
హైదరాబాద్లోనూ తేలికపాటి జల్లులు పడే చాన్స్ ఉందంది. రోజంతా మబ్బులు, ఉదయం పొగమంచు ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు మంగళవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, జనగామ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. మరికొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం జిల్లాలోని నెల్లిలో 2.7, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 2.1, సిరికొండలో 2, పిప్పల్ధారిలో 1.8, జైనథ్లో 1.7, ఆదిలాబాద్లో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్లో ఓవైపు ఎండ, మరోవైపు వానలు
రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో వాతావరణం మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాల ప్రభావం ఉన్నా.. ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో రికార్డ్ అయ్యాయి. ఆ జిల్లాలోని జైనథ్లో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోనూ టెంపరేచర్లు సాధారణం కన్నా రెండుమూడు డిగ్రీలు ఎక్కువే నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 39.4, వనపర్తి జిల్లా దగడులో 39.1, నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 38.2, నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో 38.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి.