ఎంతో కష్టపడి పని చేసి, ఎన్నో సినిమాల్లో నటించిన నటీనటులు కూడా.. సంపాదించినదాన్ని నిలబెట్టు కోవడం చేతకాక దీన స్థితికి చేరుకున్న ఉదంతాలు ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పటి యాక్టర్స్ మాత్రం అలాంటివి జరగకుండా ముందు నుండే జాగ్రత్తపడుతున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. హీరోలే కాదు, వారితో సమానంగా హీరోయిన్లు కూడా వ్యాపారాల్లోకి దిగి నాలుగు కాసులు కూడబెట్టుకుంటున్నారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది.
నటిగా బిజీగా ఉన్నప్పుడే బిజినెస్లోకి దిగింది రకుల్. ‘ఎఫ్ 45’ పేరుతో హైదరాబాద్లో రెండు ఫిట్నెస్ సెంటర్లు నడుపుతోంది. వైజాగ్లో కూడా ఓ బ్రాంచ్ తెరించింది. ఇప్పుడు స్పోర్ట్స్ బిజినెస్లోకి కూడా దిగుతోంది. టెన్నిస్ ప్రీమియర్ లీగ్లో ఓ జట్టుకి కో–ఓనర్గా మారింది రకుల్. తాను ‘హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టుకి భాగస్వామి అయినట్లు ఆమే స్వయంగా సోషల్ మీడియాలో
వెల్లడించింది.
బాలీవుడ్ నటీమణులు ప్రీతి జింటా, శిల్పాశెట్టి ఐపీఎల్లోకి ఎంటరయ్యారు. రకుల్ కూడా వారి తరహాలోనే ప్రణాళికలు వేసుకుంటోంది. నిజానికి ఆమె కెరీర్ గతంతో పోలిస్తే కాస్త డల్గానే ఉంది. కొన్నాళ్లు పోతే ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ ముందే ఆలోచించి ఇలా కొత్త బిజినెస్ ప్లాన్ చేసుకుని ఉంటుంది రకుల్.