
ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ కోసం భూమినిచ్చినందుకు గాను పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా రిజర్వాయర్ భూనిర్వాసిత రైతులు ఎడ్లబండ్లతో కలెక్టరేట్ కు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. అనంతరం రైతుల ఆందోళనతో కొన్ని ఎడ్లబండ్ల ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నాలుగేళ్లు గడిచినా అధికారులు పరిహారం ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులకు ఎకరాకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని, కానీ ఇంకా వందల ఎకరాలకు పరిహారం పెండింగ్ లో ఉందని తెలిపారు. 1.47 టీఎంసీ కెపాసిటీతో చెనక కొరటా బ్యారేజీకి అనుసంధానంగా రిజర్వాయర్ నిర్మాణం కాగా.. అందు కోసం అధికారులు దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని సేకరించారు.