మరాఠీ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. బాలీవుడ్ భారీ బడ్జెట్ ఎపిక్ ‘రామాయణ’లో భరతుడి పాత్రలో నటిస్తున్న ఆదినాథ్ కోఠారే, తన భార్య ఉర్మిళ కనేట్కర్తో కలిసి 15 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలికారు. ఈ జంట తమ సోషల్ మీడియా ద్వారా గురువారం (జులై 16, 2026న) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా గుర్తింపు పొందిన ఈ జంట.. అనూహ్యంగా విడిపోవడం మరాఠీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే వీరి విడాకులకు గల కారణం ఏంటనేది మాత్రం సస్పెన్స్గా మారింది.
విడిపోయినప్పటికీ.. తల్లితండ్రులుగా..
స్టార్ జంట ఆదినాథ్ కొఠారే, ఊర్మిళ కనిత్కర్ తమ నిర్ణయంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎంతో ఆలోచించి, పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే దంపతులుగా విడిపోయినా, తమ కుమార్తె జిజా కోసం తల్లిదండ్రులుగా కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. జిజాకు ప్రేమ, భద్రత, మంచి భవిష్యత్తు అందించేందుకు ఇద్దరూ కలిసి కో-పేరెంటింగ్ కొనసాగిస్తామని తెలిపారు.
ఇన్నేళ్లుగా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని, అభిమానులు, మీడియా అందించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వ్యక్తిగత జీవితంలోని ఈ కొత్త దశలో గోప్యతను గౌరవించాలని కోరిన ఈ జంట.. ఈ విషయంపై ఇదే చివరి ప్రకటన అని, ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగింది?
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఆదినాథ్, ఉర్మిళ 2011లో వివాహం చేసుకున్నారు. దర్శకుడు మహేష్ కోఠారే తెరకెక్కించిన 'శుభమంగళ సావధాన్' సినిమా సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదే ఉర్మిళకు తొలి సినిమా. షూటింగ్ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అనంతరం ఆదినాథ్ ప్రేమను వ్యక్తం చేయగా, కొంతకాలానికే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. ఈ దంపతులకు 'జిజా' అనే కుమార్తె కూడా ఉంది.
2022 నుంచే విభేదాలు మొదలయ్యాయా?
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. 2022 వరకు ఆదినాథ్, ఉర్మిళ ఒకరితో ఒకరు కలిసి దిగిన ఫొటోలు, రొమాంటిక్ పోస్టులు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుండేవారు. అయితే 2022లో ఆదినాథ్ నటించిన 'చంద్రముఖి' సినిమాలో, ఆయనతో కలిసి నటి అమృతా ఖాన్విల్కర్ నటించిన తర్వాత దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయని ప్రచారం జరిగింది. ఆ సమయంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఉర్మిళ తన కుమార్తెతో కలిసి వేరే ఇంటికి వెళ్లి ఉండటం ప్రారంభించిందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం కూడా ఆపేశారు. ఉర్మిళ తన కుమార్తెతో ఉన్న ఫొటోలు మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కనిపించింది.
After years together, #AadinathKothare and #UrmillaKanetkar have announced their separation. In a heartfelt joint statement, the duo said they will continue to co-parent their daughter, Jizah, with love and have requested privacy during this time.#News #FilmfareMarathi pic.twitter.com/IVAzIAum0p
— Filmfare (@filmfare) July 16, 2026
మళ్లీ నటిగా బిజీ అయిన ఉర్మిళ..
వివాహం తర్వాత నటనకు దూరమైన ఉర్మిళ, కొంతకాలం కోఠారే ప్రొడక్షన్స్ బాధ్యతలు చూసుకున్నారు. అయితే తర్వాత మరో నిర్మాణ సంస్థలో 'తుజేచ్ మీ గీత్ గాత్ ఆహే' అనే సీరియల్లో నటించడం ప్రారంభించారు. దీంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇద్దరూ ఒకరి పుట్టినరోజుకు మరొకరు శుభాకాంక్షలు చెప్పడం కూడా మానేశారు. అయితే మహేష్ కోఠారే ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉర్మిళ హాజరుకావడంతో విడాకుల వార్తలు కొంతకాలం సద్దుమణిగాయి. అయినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు.
నాలుగేళ్ల ప్రచారానికి తెర..
చివరికి నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదిస్తూ.. తాము విడిపోతున్నట్లు ఆదినాథ్, ఉర్మిళ అధికారికంగా ప్రకటించారు. అయితే విడాకులకు గల అసలు కారణం ఏమిటన్న దానిపై మాత్రం ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం!
ఇదిలా ఉంటే, బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా విజువల్ వండర్ 'రామాయణం' చిత్రంలోనూ ఆదినాథ్ కోఠారే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరాముడి తమ్ముడు 'భరతుడు' పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఊర్మిళ కనేట్కర్ 'దునియాదారీ', 'మాలా ఆయ్ వ్హాయ్చ్య్!', 'తీ సద్ధ్యా కాయ్ కర్తే' వంటి పలు సూపర్హిట్ చిత్రాల్లో నటించి మరాఠీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు.
