
హైదరాబాద్, వెలుగు: రైతుల భూములతో పాటు వాళ్ల జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్రావు అన్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై పునఃసమీక్షించి, రైతులకు నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పుట్టపాకకు చెందిన రైతులు ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్రావును కలిశారు. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ అలైన్మెంట్ మార్పుతో తమ సాగు భూములు కోల్పోతున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత అలైన్మెంట్ను రద్దు చేసి పంట భూములను కాపాడాలని కోరారు. రైతుల విజ్ఞప్తిపై స్పందించిన రాంచందర్ రావు.. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ప్యానెల్ విజయం సాధించడంపై రాంచందర్రావు హర్షం వ్యక్తం చేశారు. ‘‘గతంలో రోహిత్ వేముల ఘటనను ఉపయోగించుకుని ఏబీవీపీ, బీజేపీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కులమతాల పేరుతో విద్యార్థులను విభజించడానికి ప్రయత్నించాయి. కానీ చివరికి విద్యార్థులు నిజం గుర్తించారు’’ అని పేర్కొన్నారు.