చైనా బెట్టింగ్ యాప్స్‌కు పేటీఎం, బిల్ డెస్క్ ద్వారా పేమెంట్స్?

చైనా బెట్టింగ్ యాప్స్‌కు పేటీఎం, బిల్ డెస్క్ ద్వారా పేమెంట్స్?

న్యూఢిల్లీ: పేటీఎం, రేజ‌ర్‌పే, బిల్ డెస్క్ స‌హా దేశంలోని ప‌లు పేమెంట్ గేట్ వే కంపెనీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నిఘా పెట్టింది. వీటిని చైనాకు చెందిన ప‌లు బెట్టింగ్ యాప్స్‌కు పేమెంట్స్ చేసేందుకు ఇండియ‌న్స్ వాడుకుంటున్న‌ట్లు ఇప్ప‌టికే చేసిన ఇంట‌ర్న‌ల్ ఇన్వెస్టిగేష‌న్‌లో తేలింది. దీంతో చైనా సంస్థ‌ల‌కు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్న ఈ పేమెంట్ గేట్ వే కంపెనీల‌పై మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద నిఘా వేసింది. వాటి ద్వారా జ‌రుగుతున్న పేమెంట్స్‌ను ప‌రిశీలించేందుకు ఈడీ రంగంలోకి దిగిన‌ట్లు ప‌లు జాతీయ ఎన‌క‌మిక్ న్యూస్ సంస్థ‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌నీలాండ‌రించ్ నిరోధ‌క చ‌ట్టం కింద‌ పేమెంట్ గేట్‌వే కంపెనీల‌పై ఈడీ దృష్టి సారించ‌డం ఇదే తొలిసారి. పేటీఎం, రేజ‌ర్‌పే, బిల్ డెస్క్ పేమెంట్ గేట్‌వేల ద్వారా ఇండియా నుంచి ఎవ‌రైనా స‌రే నిషేధిత చైనా బెట్టింగ్ యాప్స్‌కు పేమెంట్ లేదా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్టు తేలినా పీఎంఎల్ఏ 2002 చ‌ట్టం కింద ఆయా సంస్థ‌ల‌పై ఈడీ కేసు న‌మోదు చేసి బోనులో నిల‌బెట్ట‌నుంది.

రేజ‌ర్‌పే ద్వారా చ‌ట్ట వ్య‌తిరేక లావాదేవీలు జ‌రిగిన‌ట్టు ఇప్ప‌టికే ఆధారాలు ల‌భించాయ‌ని తెలుస్తోంది. ఆ సంస్థ ప్ర‌తినిధుల‌ను ఈడీ అధికారులు ప్ర‌శ్నించ‌డం కూడా న‌డుస్తోంది. చైనా బెట్టింగ్ యాప్స్‌లో ఇండియ‌న్లు డ‌బ్బులు పెట్టేందుకు ఎలా స‌హ‌క‌రించారు, ఇటువంటి నిషేధిత ట్రాన్సాక్ష‌న్ల‌పై ఇంట‌ర్న‌ల్ సిస్ట‌మ్ రెడ్ ఫ్లాగ్ రైజ్ చేయ‌లేదా వంటి ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. క్యాష్‌ప్రీ, పేటీఎం, బిల్ డెస్క్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్ వంటి కంపెనీల‌పై ఇంకా స్క్రూటినీ న‌డుస్తోంద‌ని ఆ క‌థ‌నాలు పేర్కొన్నాయి. ఈ వ్య‌వ‌హారంపై త‌మ ప్ర‌తినిధుల‌ను, మ‌ర్చెంట్స్‌ను బెంగ‌ళూరు ఈడీ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు క్యాష్‌ఫ్రీ, ఇన్ఫీబీమ్ సంస్థ‌లు తెలిపాయి. పేమెంట్ ప్రొటోకాల్స్, నిషేధిత లావాదేవీల వెరిఫికేష‌న్, ఏఐ టెక్నాల‌జీ, పేమెంట్ మెథ‌డ్స్‌లో లూప్‌హోల్స్ ఉండే ఆస్కారం వంటి వాటిపై ప్ర‌శ్నించార‌ని, త‌గిన స‌మాధానాలు చెప్పామ‌ని ఈ రెండు కంపెనీల ప్ర‌తినిధులు వివ‌రించారు. అయితే పేటీఎం, బిల్‌డెస్క్, రేజ‌ర్‌పే సంస్థ‌లు ఈ అంశంపై స్పందించ‌లేదు.