న్యూఢిల్లీ: బారోవర్లు లోన్ ఈఎంఐలను కట్టలేకపోతే ఫైనాన్షియల్ సంస్థలు ఇష్టానుసారంగా పెనాల్టీలు వేయడం ఇక నుంచి కుదరదు. లోన్ అకౌంట్లకు సంబంధించి పీనల్ ఇంట్రెస్ట్ చార్జీలపై గైడ్లైన్స్ను ఆర్బీఐ ప్రకటించింది. కొన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు పెనల్ రేట్స్ కంటే ఎక్కువ చార్జీలు వేస్తున్నాయి. ఫైనాన్షియల్ సంస్థలు వేస్తున్న పెనాల్టీలు, లేట్ రీపేమెంట్లపై వేస్తున్న వడ్డీ, పీనల్ చార్జీలకు సంబంధించి టెర్మ్స్, కండీషన్లపై ఆర్బీఐ ఓ డ్రాఫ్ట్ పేపర్ రిలీజ్ చేసింది. ఈ రూల్స్పై బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు వచ్చే నెల 15 లోపు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు.
డ్రాఫ్ట్లో ఏముందంటే!
వడ్డీల మాదిరి పెనాల్టీలను కూడా కౌంపౌండింగ్ చేయడాన్ని ఆర్బీఐ వ్యతిరేకిస్తోంది. లెండర్లందరూ ఇలా చేస్తారని కాదని, కానీ ఆర్బీఐ రూల్ తేవడంతో పెనాల్టీలను కాంపౌండింగ్ (వేసిన చార్జీలపై మళ్లీ చార్జీ వేయడం) చేయరని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇది బారోవర్లకు మేలు చేసేదని అంటున్నారు. ‘బారోవర్లు ఈఎంఐలను కట్టలేకపోతే పెనాల్టీ పడుతోంది. ఓవర్డ్యూ అమౌంట్పై వడ్డీ కూడా వేస్తున్నారు. అసలు, వడ్డీ చార్జీలు, పెనాల్టీలు అన్నీ ఈ అమౌంట్లో ఉంటున్నాయి. ఒకవేళ రెండో నెలలో కూడా ఈఎంఐ కట్టకపోతే పెనాల్టీ చార్జీలపై మళ్లీ పెనాల్టీ పడుతోంది’ అని డిజిటల్ లెండింగ్ కన్సల్టంట్ పారిజాత్ గార్గ్ పేర్కొన్నారు. బారోవర్లు రీపేమెంట్లను లేట్ చేయకూడదనే ఉద్దేశంతో పీనల్ చార్జీలను తీసుకొచ్చారని, కానీ ప్రస్తుతం ఫైనాన్షియల్ సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి దీన్ని వాడుకుంటున్నాయని అన్నారు. ఆర్బీఐ గైడ్లైన్స్ డ్రాఫ్ట్ ప్రకారం, ఫైనాన్షియల్ సంస్థలు పీనల్ చార్జీలను ఎలా లెక్కిస్తున్నామో క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. బిజినెస్ లోన్లు, ఎంఎస్ఎంఈ వంటి లోన్లపై వేస్తున్న పీనల్ చార్జీల కంటే రిటైల్ లోన్లపై వేస్తున్న చార్జీ ఎక్కువగా ఉండకూడదు. ఒకేలాంటి లోన్లు, ప్రొడక్ట్లపై వేస్తున్న పీనల్ చార్జీలు వేరు వేరుగా ఉండకూడదు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లోన్లకు సంబంధించిన ఈఎంఐ రిమైండర్లను పంపాలి. అంతేకాకుండా ఈఎంఐ లేటుగా పే చేస్తే ఎంత పెనాల్టీ పడుతుందో కూడా చెప్పాలి.