న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై తర్వాత ఆన్లైన్ మోసాలు మళ్లీ పెరిగాయని ఎస్బీఐ ఈవెంట్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మోసాల సంఖ్య తగ్గుతూ వచ్చిందని, కానీ జులై తర్వాత మళ్లీ పెరిగిందని తెలిపారు. ఇది సీజనల్ కారణాల వలన జరిగి ఉండొచ్చని అన్నారు.
‘‘2024–25లో 23,953 డిజిటల్ మోసాలు జరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ అయిన 36 వేల నుంచి నుంచి తగ్గాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ (కార్డ్, ఇంటర్నెట్) విభాగంలో మోసాల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం ఫ్రాడ్ కేసుల్లో 60శాతం ప్రైవేట్ బ్యాంక్లు ఎదుర్కొనగా, మోసపోయిన డబ్బులో 71శాతం ప్రభుత్వ బ్యాంకుల వాటా ఉంది”అని ఆర్బీఐ రిపోర్ట్ పేర్కొంది.
ఆర్బీఐ "మ్యూల్ హంటర్" వంటి డిజిటల్ టూల్స్ ద్వారా ఫ్రాడ్ అకౌంట్స్ను గుర్తించి, మోసపోయిన డబ్బును రికవరీ చేయడానికి ప్రయత్నిస్తోందని శంకర్ అన్నారు. బ్యాంకులు యూపీఐ సామర్థ్యాన్ని ముందుగా ఊహించలేకపోయాయని, ఫిన్టెక్ సంస్థలు వేగంగా స్పందించగలిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీల వల్ల బ్యాంకులు కొంత రిస్క్ ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. డిజిటల్ రూపాయి వల్ల బ్యాంకింగ్ వ్యాపారం రూపురేఖలు మారుతాయని చెప్పారు.
