
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి 2021–22 కి గాను రూ. 30,307 కోట్లను మాత్రమే డివిడెండ్గా ఇచ్చేందుకు ఆర్బీఐ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. మిగులు నిధులను కేంద్రానికి ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. మానిటరీ, ద్రవ్య పరమైన రిస్క్లను, క్రెడిట్, ఆపరేషనల్ రిస్క్లను దృష్టిలో పెట్టుకొని కాంటింజెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్బీ) ని 5.50 శాతంగా నిర్ణయించారు. అంటే మిగులు నిధుల్లో 5.50 శాతం అమౌంట్ను పైన పేర్కొన్న రిస్క్ల కోసం దాచిపెట్టారని అనొచ్చు. కేంద్రం అంచనావేసిన దాని కంటే తక్కువ డివిడెండ్ అమౌంట్ను ఆర్బీఐ ఈసారి ఇస్తోంది. 2021–22 కి గాను రూ. 73,948 కోట్ల డివిడెండ్ను ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంకుల నుంచి అందుతుందని ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం అంచనావేసింది. 2020–21 కి గాను 2022 లో రూ.1,01 లక్షల కోట్లను డివిడెండ్గా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్బీఐ నుంచి కేంద్రం అందుకుంది. ఈ అమౌంట్లో ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్ అమౌంటే రూ. 99,122 కోట్లుగా ఉందని గుర్తుంచుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ (ఏప్రిల్–మార్చి) కు తగ్గట్టు ఆర్బీఐ కూడా తన అకౌంటింగ్ ఇయర్ను జులై–జూన్ నుంచి ఏప్రిల్–మార్చికి 2020 లో మార్చుకున్న విషయం తెలిసిందే. 2020 జులై నుంచి మార్చి 2021 మధ్య తొమ్మిది నెలలే అయినప్పటికీ, కేంద్రానికి రూ. 99,122 కోట్ల డివిడెండ్ను ఆర్బీఐ ఇచ్చింది.
ఎందుకు తగ్గిందంటే..?
కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ డివిడెండ్ ఇవ్వడానికి ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఇన్కమ్ తగ్గడమేనని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో ఆర్బీఐకి వివిధ ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే వడ్డీ తగ్గిందని అన్నారు. అంటే లిక్విడిటీ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ద్వారా ఆర్బీఐకి వచ్చే వడ్డీ తగ్గిందని చెబుతున్నారు. కరోనా వలన 2020 లో వ్యవస్థలో ఆర్బీఐ లిక్విడిటీ పెంచిన విషయం తెలిసిందే. కిందటి ఆర్థిక సంవత్సరంలో కొన్ని తాత్కాలిక రివర్స్ రెపో రేటు చర్యల ద్వారా వ్యవస్థలోని లిక్విడిటీని తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అంటే గతంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఫుల్గా మనీ ఇచ్చిన ఆర్బీఐ, కిందటి ఆర్థిక సంవత్సంరలో తాత్కాలిక చర్యలతో ఫైనాన్షియల్ సంస్థల నుంచి లిక్విడిటీని తిరిగి తీసుకోవడం ప్రారంభించింది. దీంతో ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్బీఐ వడ్డీ ఇవ్వడం పెరగగా, ఆర్బీఐకి ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే వడ్డీ తగ్గిందని చెప్పొచ్చు. యాన్యువల్ అకౌంట్ రిపోర్ట్ను ఈ నెల చివరిలో ఆర్బీఐ విడుదల చేయనుంది.