న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాను అంతకుముందు 6.7 శాతం నుంచి 7 శాతానికి పెంచినట్టు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. ఇండియా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పెట్టుబడుల ద్వారా బలమైన వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది.వినియోగదారుల డిమాండ్లో మెరుగుదల ఉంటుందని ఏడీబీ ఔట్లుక్ ఏప్రిల్ ఎడిషన్లో పేర్కొంది. ఏడీబీ ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం "ప్రధాన వృద్ధి ఇంజన్"గా ఎదుగుతుందని వివరించింది.
2025–-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేసింది. వృద్ధి బలంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు 2022-–23 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7.6 శాతం జీడీపీ కంటే తక్కువే! 2022-–23 ఆర్థిక సంవత్సరంలో వినియోగం బాగుండటంతో జీడీపీ వృద్ధిని పెంచిందని ఏడీబీ తెలిపింది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి చెందుతుందని గత ఏడాది డిసెంబర్లో ఏడీబీ అంచనా వేసింది.
సాధారణ రుతుపవనాల అంచనాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడం, తయారీ సేవల రంగాలలో స్థిరమైన ఊపందుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా అంచనా వేశామని ఆర్బీఐ గత వారం పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధిక మూలధన వ్యయం, ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడుల పెరుగుదల, బలమైన సేవా రంగ పనితీరు ఇందుకు కారణమని తెలిపింది