
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల్లో భారీ కోత పడింది. ఇష్టారీతిన గ్యారంటీ అప్పులు చేయడంతో, బాండ్ల వేలంతో తీసుకునే రుణానికి ఈసారి ఆర్బీఐ నుంచి బ్రేక్లు పడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ చేసిన సూచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. రూ.19వేల కోట్ల అప్పును ఆర్బీఐ తగ్గించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సర్కార్ తీసుకునే అప్పు.. ఎంత వరకు సీలింగ్ ఉందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. మొన్నటిదాకా అడ్హక్(తాత్కాలిక) పద్ధతిలో రుణం తీసుకున్న రాష్ట్రం.. ఇక మీద సాధారణంగానే తీసుకోనుంది. దాదాపు రూ.54వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో ప్రభుత్వం భావించినప్పటికీ.. ఇప్పుడు విధించిన కోతతో రూ.35వేల కోట్లు మాత్రమే రానున్నాయి. ఇవిగాకుండా గ్యారంటీల పేరుతో తీసుకునే అప్పులు కూడా పరిమితుల మేరకే లభించనున్నాయి. ఎట్లపడితే అట్ల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు తీసుకోకుండా కేంద్ర ఆర్థిక శాఖ చెక్ పెట్టింది. తీసుకున్న అప్పు ఎలా తిరిగి చెల్లిస్తారో స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చాకే.. గ్యారంటీ లోన్లు మంజూరు చేయనున్నారు. బడ్జెట్ నుంచి చెల్లింపులు చేసేట్టు ఉంటే.. అప్పు రాదని స్పష్టం చేసినట్లు తెలిసింది.
రానున్న 8 నెలల్లో రూ.25వేల కోట్లే..
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మార్చి నాటికి రూ.35వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునేందుకు చాన్స్ ఉంది. దీంట్లో ఇప్పటికే రూ.10వేల కోట్లు తీసుకున్నది. జూన్లో రూ.7వేల కోట్లు తీసుకోగా, మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ.3వేల కోట్ల అప్పు తీసుకుంది. దీంతో మరో 8నెలల్లో ఇంకో 25వేల కోట్లు మాత్రమే తీసుకునేందుకు చాన్స్ ఉంది. ఈ లెక్క ప్రతినెలా రూ.3 వేల కోట్ల చొప్పున ప్రభుత్వం అప్పు చేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.47,500 కోట్ల అప్పు తీసుకుంది. బాకీ విషయంలోరాజకీయం ఏమీ లేదని ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడంతో ఏపీకి అదనంగా రూ.7వేల కోట్ల అప్పు వస్తోందని తెలిపారు. అప్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర సర్కార్ భావించినప్పటికీ దీనిపై పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది.
కార్పొరేషన్ల అప్పులపై ఆశలు వదులుకోవాల్సిందే..
గ్యారంటీ అప్పులను ఇష్టమొచ్చినట్లు తెచ్చుకునే వీల్లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే గ్యారంటీ అప్పులపై అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఇటీవల లెటర్ కూడా రాసింది. దీంతో రాష్ట్ర సర్కార్ గ్యారంటీ అప్పులపై కూడా ఆశలు వదులుకుంది. పోయిన ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర సర్కార్ గ్యారంటీల పేరుతో తెచ్చే అప్పులను లెక్కలో చూపట్లేదు. ఇదంతా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆ అప్పుల కిస్తీలు మాత్రం బడ్జెట్లో నుంచి కడుతూ వస్తోంది. ఇప్పుడు ఇలా కట్టినవన్నీ ఎఫ్ఆర్బీఎం (ఆర్బీఐ) అప్పుల కింద లెక్కిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే 2023 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు మొత్తం రూ.3.44 లక్షల కోట్లకు చేరుతుందని మార్చిలో పెట్టిన బడ్జెట్లోనే ప్రభుత్వం వెల్లడించింది. కానీ బడ్జెట్తో సంబంధం లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే తెచ్చిన రుణాలు రూ.1,35,282 కోట్లు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ష్యూరిటీపై తెచ్చింది. మొత్తంగా ప్రభుత్వం తెచ్చిన అప్పుల మొత్తం రూ.4.50 లక్షల కోట్లు దాటుతోంది.