
న్యూఢిల్లీ: చలామణిలో ఉన్న రూ.రెండు వేల నోట్ల మొత్తం విలువ రూ.9,760 కోట్లకు తగ్గిందని, 97.26 శాతం నోట్లు తిరిగొచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. ఉపసంహరించుకున్న రూ.రెండు వేల నోట్లలో దాదాపు 2.7శాతం ఇప్పటికీ చలామణిలో ఉన్నాయని తెలిపింది. వాటిని బ్యాంకు శాఖలలో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగిసిన రెండు నెలల తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మే 19 న రూ.రెండు వేల డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అక్టోబర్ 7 వరకు గడువు ఇచ్చింది. రూ.రెండు వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం ప్రకటించినప్పుడు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉండేవి. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి వీటి విలువ రూ.9,760 కోట్లకు తగ్గింది. ఇప్పటికీ ప్రజలు దేశంలోని తమ బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ చేయడానికి ఏదైనా పోస్టాఫీసు నుంచి, ఏదైనా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు ఇండియా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చు. అయితే ఇక నుంచి కూడా రూ.రెండు వేల నోట్లు చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.