
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను ముందు అనుకున్న దానికన్నా మరికొన్ని రోజులు పెంచడంతో మారటోరియం గడువును మరో 3 నెలలు పెంచాలని ఆర్బీఐ భావిస్తోంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులను ఇస్తూ.. లాక్డౌన్ ను మే 17 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆర్బీఐ మార్చి 27 ప్రకటించిన మూడు నెలల మారటోరియం మే 31తో ముగియనుంది. దాంతో మారటోరియాన్ని కూడా మరికొంత కాలం పొడిగించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. మారటోరియం కాలాన్ని మరింత పొడిగించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సహా వివిధ వర్గాల నుండి సూచనలు వచ్చాయని.. అందుకే ఆర్బీఐ ఆ సూచనలను పరిశీలిస్తోందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.
లాక్డౌన్ గడువు పెరగడం వల్ల మే 31తో మారటోరియం కాలం ముగిసిన తర్వాత బ్యాంకులకు రుణాలు చెల్లించడం ప్రజలకు కష్టంతో కూడుకున్న పని. వెంటనే వారికి డబ్బులు సర్దుబాటు కావు. అందుకే మారటోరియం కాలాన్ని మరింత పొడిగించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మారటోరియాన్ని మరో మూడు నెలలు పెంచడం వల్ల అటు బ్యాంకులకు, ఇటు లోన్లు తీసుకున్న వారికి అందరికీ ఉపశమనంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో శనివారం సమావేశం నిర్వహించారు. మారటోరియాన్ని మరో మూడు నెలలు పెంచితే ఎలా ఉంటుదన్న దానిపై వారితో చర్చించినట్లు సమాచారం.