
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల అన్సెక్యూర్డ్ లోన్లు పెరుగుతున్నాయి. ఫలితంగా మొండిబాకీలు పెరిగే అవకాశం ఉండడంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఎస్బీఐ, బీఓబీ వంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, బజాజ్ ఫైనాన్స్ వంటి ఎన్బీఎఫ్సీలు ఇచ్చే కన్జూమర్ లోన్లు వంటి అన్సెక్యూర్డ్ లోన్లపై రూల్స్ కఠినం చేసింది. ఇచ్చే అప్పుకు తగ్గట్టు ఫైనాన్షియల్ సంస్థల దగ్గర క్యాపిటల్ ఉండడం తప్పనిసరి. దీనిని రిస్క్ వెయిట్ అంటారు. తాజాగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల అన్సెక్యూర్డ్ లోన్లపై రిస్క్ వెయిట్ను ఆర్బీఐ 25 శాతం పెంచింది. ఫలితంగా ఇటువంటి లోన్ల కోసం అదనంగా 25 శాతం ఎక్కువ క్యాపిటల్ను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు పక్కన పెట్టాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే పర్సనల్ లోన్లకు (పాతవి, కొత్తగా ఇచ్చే లోన్లకు) ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. అలానే క్రెడిట్ కార్డ్ లోన్లపై కూడా రిస్క్ వెయిట్ను ఆర్బీఐ పెంచింది. హౌసింగ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, వెహికల్ లోన్లు, గోల్డ్, బంగారు నగలపై తీసుకునే లోన్లు, మైక్రో ఫైనాన్స్ లోన్లకు మినహాయింపు ఇచ్చారు.
పర్సనల్ లోన్లు వేగంగా పెరగడంతో..
గతంలో బ్యాంకులు రిస్క్ వెయిట్ కింద 125 శాతం మిగులు క్యాపిటల్ను పక్కన పెట్టాల్సి ఉండేది. తాజాగా ఈ నెంబర్ 150 శాతానికి పెరిగింది. అలానే ఎన్బీఎఫ్సీల రిస్క్ వెయిట్ 100 శాతం నుంచి 125 శాతానికి పెరిగింది. అంటే ఒక బారోవర్కు బ్యాంక్ రూ. లక్ష పర్సనల్ లోన్ కింద ఇస్తే, దీనికి తగ్గట్టు సంబంధిత బ్యాంక్ దగ్గర రూ.1.50 లక్షల క్యాపిటల్ ఉండాలి. బ్యాంకులు ఎక్కువ రిస్క్ తీసుకునే కొద్దీ ఎక్కువ క్యాపిటల్ అవసరం అవుతుంది. డిపాజిటర్లను రక్షించడానికి ఆర్బీఐ రూల్స్ కఠినం చేసింది. అన్సెక్యూర్డ్ కన్జూమర్ లోన్లపై బోర్డ్ ఆమోదం తెలిపిన లిమిట్ను కచ్చితంగా అమలు చేయాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకులు ఇచ్చే పర్సనల్ లోన్లు వేగంగా పెరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సెగ్మెంట్పై ఫోకస్ పెట్టామని అన్నారు. ముఖ్యంగా మూడు నుంచి నాలుగు నెలల కోసం రూ.10 వేల వరకు తీసుకునే చిన్న సైజ్ పర్సనల్ లోన్లపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. కాగా, దేశ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే అన్సెక్యూర్డ్ లోన్లు గత ఏడాది కాలంలో 15 శాతం వృద్ధి చెందాయి.