ముంబై: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన తమ ఆఖరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాణించింది. టార్గెట్ ఛేజింగ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (54 బాల్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73) నిలకడగా ఆడటంతో... గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్కు చెక్ పెట్టింది. తాజా విజయంతో బెంగళూరు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నా.. నాకౌట్కు చేరాలంటే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్), మిల్లర్ (25 బాల్స్లో 3 సిక్సర్లతో 34), సాహా (22 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 31) రాణించారు. గిల్ (1), వేడ్ (16), రాహుల్ తెవాటియా (2) నిరాశపర్చారు. పాండ్యా, మిల్లర్ నాలుగో వికెట్కు 61 రన్స్ జోడించారు. లాస్ట్ రెండు ఓవర్లలో రషీద్ (19 నాటౌట్), హార్దిక్ 34 రన్స్ రాబట్టడంతో ఆరో వికెట్కు 15 బాల్స్లోనే 36 రన్స్ జతయ్యాయి. హాజిల్వుడ్ 2, హసరంగ, మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు.
ఆ తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 170/2 స్కోరు చేసి గెలిచింది. కోహ్లీ, డుప్లెసిస్ (38 బాల్స్లో 5 ఫోర్లతో 44) ఫస్ట్ వికెట్కు 115 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. 15వ ఓవర్లో డుప్లెసిస్ ఔటైనా.. తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ (40 నాటౌట్) దంచికొట్టాడు. 16వ ఓవర్లో విరాట్ ఔట్కావడంతో సెకండ్ వికెట్కు 31 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఇక 18 బాల్స్లో 21 రన్స్ చేయాల్సిన దశలో కార్తీక్ (2 నాటౌట్)తో కలిసి మ్యాక్సీ నాలుగు ఫోర్లతో.. విజయాన్ని ఖాయం చేశాడు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.