రియల్‌‌మీని మరింత విస్తరిస్తాం

రియల్‌‌మీని మరింత విస్తరిస్తాం

హైదరాబాద్‌‌, వెలుగు: బడ్జెట్‌‌ ధరల్లో నాణ్యమైన స్మార్ట్‌‌ఫోన్లను విక్రయించే చైనా కంపెనీ రియల్‌‌మీ   తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కంపెనీని మరింత విస్తరించనుంది. త్వరలో కొత్త సర్వీసు సెంటర్లను, ఎక్స్​క్లూజివ్​ షోరూంలను ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈఓ మాధవ్‌‌ శేఠ్‌‌ ప్రకటించారు. హైదరాబాద్‌‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రియల్‌‌మీ సీ2 బడ్జెట్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ను తెలుగు రాష్ట్రాల ఆఫ్‌‌లైన్‌‌ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది  ‘ఎక్స్‌‌’ సిరీస్‌‌లో ఐదు కొత్త స్మార్ట్‌‌ఫోన్‌‌ మోడల్స్‌‌, మొబైల్‌‌ యాక్సెసరీలను విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఇండియన్లు తక్కువ ధరల్లో నాణ్యమైన వస్తువులను కోరుకుంటున్నారని, అందుకే 2జీ ర్యామ్‌‌ రియల్‌‌మీ సీ2 మోడల్‌‌కు రూ.5,999 ధర నిర్ణయించామన్నారు. ఇందులో 6.1 ఇంచుల డ్యూడ్రాప్‌‌ ఫుల్‌‌ స్క్రీన్‌‌ ఉండటం వల్ల వీడియోలు చూడటానికి, గేమ్స్‌‌ ఆడటానికి అనువుగా ఉంటుందని చెప్పారు. దీని డిజైన్​ అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.  ‘‘తెలంగాణలో 158 స్టోర్ల ద్వారా మా ఫోన్లను అమ్ముతున్నాం.   ఐదు సర్వీస్‌‌ సెంటర్లను నిర్వహిస్తున్నాం. వీటి సంఖ్యను మరింత పెంచుతాం. ఈ ఏడాది హైదరాబాద్‌‌లో ఎక్స్‌‌క్లూజివ్‌‌ స్టోర్‌‌ను ప్రారంభిస్తాం”అని మాధవ్​ వివరించారు.