న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ అదరగొట్టే పెర్ఫార్మెన్స్తో ఎనలిస్టుల అంచనాలను దాటింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్ (క్యూ1) లో బ్యాంక్కు ఏకంగా రూ.16,884 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన ప్రాఫిట్తో పోలిస్తే ఇది 178 శాతం ఎక్కువ. ఎస్బీఐకి ఇదే హయ్యెస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ కూడా. ఎస్బీఐకి రూ.15 వేల కోట్ల ప్రాఫిట్ వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నౌ పోల్ అంచనావేసింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 24.7 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) ఎగిసి రూ.38,905 కోట్లకు చేరుకోగా, గ్రాస్ ఎన్పీఏల( మొండిబాకీల) రేషియో 3.9 శాతం నుంచి 2.76 శాతానికి దిగొచ్చింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం గ్రాస్ ఎన్పీఏల రేషియో 2.78 శాతం నుంచి తగ్గింది.
వాల్యూ పరంగా చూస్తే, ఎస్బీఐ గ్రాస్ ఎన్పీఏలు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ.91,327.84 కోట్లుగా రికార్డయ్యాయి. కిందటేడాది జూన్ క్వార్టర్లో ఈ నెంబర్ రూ.1,13,271.72 కోట్లుగా ఉంది. బ్యాంక్ ప్రొవిజన్లు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం రూ.4,392 కోట్ల నుంచి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం రూ.3,316 కోట్ల నుంచి రూ.2,501 కోట్లకు దిగొచ్చాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో (బాసెస్ 3) జూన్ క్వార్టర్లో 14.56 శాతంగా, ఎర్న్ పర్ షేర్ (పీపీఎస్) రూ.18.92 గా నమోదయ్యాయి.
ఆటో లోన్లు రూ.లక్ష కోట్లకు పైనే
ఎస్బీఐ ఇచ్చిన అప్పులు జూన్ క్వార్టర్లో 13.90 శాతం పెరిగాయి. ఆటో లోన్లు రూ.లక్ష కోట్ల మార్క్ను క్రాస్ చేశాయి. వ్యవసాయ రుణాలు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 14.84 శాతం గ్రోత్ను నమోదు చేయగా, కార్పొరేట్ సెక్టార్ లోన్లు 12.38 శాతం వృద్ధి చెందాయి. రిజల్ట్స్ నేపథ్యంలో ఎస్బీఐ షేర్లు 3 శాతం తగ్గి రూ.573 దగ్గర ముగిశాయి.
కార్పొరేట్ లోన్లలో ఒత్తిడి లేదు..
తాము ఇచ్చిన కార్పొరేట్ లోన్లలో ఎటువంటి ఇబ్బందులు లేవని, కార్పొరేట్ లోన్ బుక్పై ఒత్తిడి లేదని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. ఈ సెక్టార్కు మరిన్ని లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అన్నారు. ‘మా లెండింగ్ బుక్లో లార్జ్, మిడ్ సైజ్ కంపెనీల నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు’ అని ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సెక్టార్కు ఇచ్చే లోన్ల విలువ రూ.3.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో రూ. లక్ష కోట్ల అప్పులను ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఇచ్చామని చెప్పారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం క్రెడిట్ గ్రోత్ను అంచనావేస్తున్నామని అన్నారు. ‘రిటైల్, అగ్రికల్చర్, స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీలు, కార్పొరేట్ సెక్టార్ ఇలా వివిధ సెగ్మెంట్లలో క్రెడిట్ గ్రోత్ ఉంది. కార్పొరేట్ సెక్టార్లో మాన్యుఫాక్చరింగ్, రోడ్వేస్, ఏవియేషన్, కన్స్ట్రక్షన్ వంటి సెక్టార్లలో గ్రోత్ కనిపిస్తోంది’ అని దినేష్ ఖారా వెల్లడించారు. ఏవియేషన్ కంపెనీలకు అప్పులివ్వడంలో ఆచితూచి అడుగులేస్తున్నామని వివరించారు.
పెరుగుతున్న బ్యాంక్ల ఖర్చులు..
బ్యాంకులు చేస్తున్న ఖర్చులు పెరుగుతున్నాయి. గ్లోబల్గా, ఇండియాలోనూ వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకులు ఫండ్స్ సేకరించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి (ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి) వస్తోంది. గత ఏడాది కాలంలో ఇటువంటి ఖర్చులు సుమారు 100 బేసిస్ పాయింట్ల (ఒక శాతం) వరకు పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీని కూడా పెంచాల్సి వస్తుండడంతో మరికొన్ని క్వార్టర్ల వరకు ఫండ్స్ సేకరణపై చేసే ఖర్చు గరిష్టాల్లోనే ఉంటుందని వివరించారు. ఈ జూన్ క్వార్టర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫండ్స్ సేకరణపై చేసే ఖర్చు 100 బేసిస్ పాయింట్లు పెరిగి 4 శాతానికి పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో ఈ నెంబర్ 3.1 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ చేస్తున్న ఇటువంటి ఖర్చు 93 బేసిస్ పాయింట్లు పెరిగి 3.67 శాతం నుంచి 4.60 శాతానికి చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్ ఫండ్స్ సేకరించడానికి చేస్తున్న ఖర్చు జూన్ క్వార్టర్లో 5.03 శాతానికి పెరిగింది. గత ఏడాది కాలంలో ఈ ఖర్చు 3.89 శాతం నుంచి 114 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ చేస్తున్న ఖర్చు 5.31 శాతానికి చేరుకుంది. కాగా, ఆర్బీఐ వడ్డీ రేట్లను 2022 మార్చి నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతంగా ఉంది.