కరోనాను తగ్గించడంలో రెమ్‌ డెసివిర్‌ ఫెయిల్ :WHO

కరోనాను తగ్గించడంలో రెమ్‌ డెసివిర్‌ ఫెయిల్ :WHO

రోనా వైరస్ చికిత్సలో ఇటీవల కాలంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఇంజక్షన్ రెమ్ డెసివిర్. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం కాకుండా డాక్టర్లు యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ ఉపయోగిస్తున్నారు. కరోనా చికిత్సలో ఇదే కీలకమైన మందు అని భారీగా ప్రచారం జరగడంతో రూ.5,400కి దొరికే ఇంజక్షన్ వైల్ కాస్తా… బ్లాకులో దాదాపు రూ.30 వేల వరకు చేరుకుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకిన సమయంలోనూ  ఈ ఇంజక్షన్ యూజ్ చేశారు.

అయితే… ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెమ్ డెసివిర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా చికిత్సలో ముఖ్యమైన మందుగా ఉపయోగిస్తున్న రెమ్ డెసివిర్ తో అనుకున్నంతగా పలితం కనిపించడంలేదని స్పష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేయడం వంటి అంశాలపై రెమ్ డెసివిర్ ఏమాత్రం ప్రభావం చూపడంలేదని వివరించింది.

దీనిపై WHO ఓ అధ్యయనం చేపట్టింది. 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించిన 28 రోజుల చికిత్సను పరిశీలించింది. రెమ్ డెసివిర్ ను హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి డ్రగ్స్ తో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ లేకుండానూ ఉన్నట్టు గుర్తించారు.

రెమ్ డెసివిర్ కరోనా చికిత్సలో ప్రాణాధార ఔషధం అని ఇప్పటికీ భావిస్తున్న సమయంలో WHO అధ్యయనం తెరపైకి వచ్చింది. భారత్ సహా దాదాపు 50 దేశాల్లో రెమ్ డెసివిర్ వాడకానికి అనుమతులు ఉన్నాయి.