ఆటగాళ్ల జాతకాలు చూసి టీమ్ సెలక్షన్.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి

ఆటగాళ్ల జాతకాలు చూసి టీమ్ సెలక్షన్.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌కు ముందు భారత ఫుట్‌‌బాల్‌ను ‘జ్యోతిష్యం’ కుదిపేస్తోంది. భారత ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టు ఎంపిక విషయంలో ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు పాటించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. 2022 ఆసియా కప్ క్వాలిఫయర్స్ జట్టు ఎంపిక సమయంలో స్టిమాక్.. ఢిల్లీకి చెందిన భూపేశ్ శర్మ అనే జ్యోతిష్యుడిని సంప్రదించినట్లు కథనాలు వస్తున్నాయి.

ప్రతి మ్యాచ్‌కు ముందు స్టిమాక్.. ఆటగాళ్ల లిస్ట్, వారి గత వివరాలు జ్యోతిష్యుడి(భూపేశ్ శర్మ)కి పంపి.. జాతకాలు చూశారని సమాచారం. ఏ మ్యాచ్‌లో ఎవరిని ఆడించాలి..? మిడ్ ఫీల్డర్‌గా ఎవరుండాలి..? ఎవరు అటాకింగ్‌ చేయాలి? జట్టులో ఎవరంటే ఉంటే గ్రహాలు అనుకూలిస్తాయి..? అన్న అంశాలపై వీరు చేసిన సుదీర్ఘ చాట్‌ రహస్యాలు బట్టబయలయ్యాయి. 20‌22 మే నుంచి జూన్ మధ్య వరకు వీరిద్దరి వందకు పైగా మెసేజ్‌లు ఎక్స్చేంజ్ అయినట్లు సమాచారం.

2022 ఆసియా కప్ క్వాలిఫయర్స్ ‌స్టేజిలో భారత ఫుట్ బాల్ జట్టు.. జోర్డాన్, కంబోడియా, అఫ్గానిస్తాన్, హాంకాంగ్‌లతో తలపడింది. ఈ నాలుగింటిలో ప్రతి మ్యాచ్‌కు ముందు స్టిమాక్.. జ్యోతిష్యుడి సలహాలను బట్టి జట్టు ఎంపిక  చేశారని సమాచారం. ఈ కథనాలపై భారత ఫుట్‌బాల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఫుట్‌బాల్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా జ్యోతిష్యుడిని నియమించుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ విషయంపై అప్పటి ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌ను వివరణ కోరగా నాకు తెలియదు అని చెప్పడం గమనార్హం.