T20 World Cup 2024: ఒకే గ్రూప్‌లో ఇండియా-పాకిస్థాన్..మ్యాచ్ ఎప్పుడంటే..?

T20 World Cup 2024: ఒకే గ్రూప్‌లో ఇండియా-పాకిస్థాన్..మ్యాచ్ ఎప్పుడంటే..?

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఐసీసీ టోర్నీలో ఈ రెండు జట్లు ఆడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండటం గ్యారంటీ. దీనికి తగ్గట్టుగానే ఐసీసీ 2013 నుంచి ఇండియా, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా షెడ్యూల్ ఏర్పాటు చేస్తుంది. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2024 టీ20 వరల్డ్ కప్ కు దాయాధి జట్లను ఒకే గ్రూప్ లో ఆడనున్నారు. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించినా.. తాజాగా మ్యాచ్ జరిగేది ఎప్పుడో ఒక అంచనాకు వచ్చేసింది. 

వెస్టింసీడ్, అమెరికా వేదికగా 2024 టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 3 నుంచి 30 వరకు ఈ పొట్టి సమరం జరగనుంది. వస్తున్న సమాచారం ప్రకారం భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 8 లేదా జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇండో,పాక్ పోరు ఏ రేంజ్ లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెల్బోర్న్ లోని 90000 మంది ప్రేక్షకుల మధ్యలో జరిగిన ఈ మ్యాచ్ ను విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో టీమిండియాను గెలిపించాడు. 

20 జట్ల మధ్య పోరు

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5  వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి. 

మొత్తం 55 మ్యాచ్ లతో ఈ సారి గ్రాండ్ గా ఈ టోర్నీ జరగనుంది. అమెరికాలో 16 మ్యాచ్ లు జరగనుండగా.. సూపర్-8 మ్యాచ్ లతో సహా ప్రధాన మ్యాచ్ లు వెస్టిండీస్ వేదికగా జరుగుతాయి. 2013 నుంచి ఐసీసీ టోర్నీలో ఒకే గ్రూప్ లో ఉంటూ వస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు ఈ సారి కూడా ఒకే గ్రూప్ లో ఉండబోతున్నాయి.        

ఐదేసి జట్లు చొప్పున 4 గ్రూపులు

జట్లు ఎక్కువ అవ్వడంతో ఈసారి టోర్నీని భిన్నంగా నిర్వహించనున్నారు. గతంలో తొలి రౌండ్‌ ముగిశాక సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడేవారు. కానీ ఈసారి 20 జట్లను ఐదేసి జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం ప్రతి గ్రూప్ నుంచి టాప్‌-2 టీమ్స్‌ సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఆపై 8 జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా ఆడిస్తారు. గ్రూప్ దశలో ఆడిన ప్రదర్శన కారణంగా సూపర్-8 షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి.