- మరో 30 మంది మిస్సింగ్
- కొనసాగుతున్న సహాయక చర్యలు
ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి జిల్లా పెట్టుముడి దగ్గర్లోని టీ ఎస్టేట్ వర్కర్లు ఉంటున్న ఇండ్లపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 37కి చేరింది. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అని అధికారులు చెప్పారు. రాజామలాయి ప్రాంతంలో 10 మృతదేహాలు వెలికి తీసినట్లు చెప్పారు. వర్షం కారణంగా సహాయక చర్యల్లో ఇబ్బందులు తెలత్తుతున్నాయని చెప్పారు. బాడీలను వెలికి తీసేందుకు స్నిఫర్ డాగ్స్ను ఉపయోగిస్తున్నట్లు సిబ్బంది చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఫైర్, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వి. మురళీధరన్ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల సంఘటనాస్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. అలపుజా, ఇడుక్కి, మల్లాపురం, కొజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్గోడ్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎమ్డీ) చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా చాలా మంది స్టూడెంట్స్ హాస్టళ్ల నుంచి వచ్చి ఇంట్లో ఉంటున్నారని, వాళ్లంతా మిస్ అయ్యారని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు.