- రూల్స్ ఉల్లంఘించినందుకే కొన్ని అవకతవకలను గుర్తించిన రెగ్యులేటరీ
న్యూఢిల్లీ: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్లు ఇవ్వడాన్ని ఆపాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. కంపెనీ తన గోల్డ్ లోన్ పోర్టుఫోలియోని సరిగ్గా పట్టించుకోవడం లేదని పేర్కొంది. కస్టమర్లు నష్టపోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులను చెక్ చేసేందుకు కిందటేడాది మార్చి 31 న ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బుక్లను ఆర్బీఐ తనిఖీ చేసింది. లోన్లను ఇచ్చేటప్పడు, డీఫాల్టర్ల బంగారాన్ని వేలం వేసేటప్పుడు గోల్డ్ ప్యూరిటీ, నెట్ వెయిట్ కొలవడంలో తేడాలు ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది.
అలానే గోల్డ్ వాల్యూలో ఇచ్చే లోన్ పరిమితులను, క్యాష్ రూపంలో అప్పులు రికవరీ చేయడంలో, అప్పుల పంపిణీలో లిమిట్స్ను ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఉల్లంఘించిందని ఆర్బీఐ వెల్లడించింది. స్టాండర్డ్ ఆక్షన్ ప్రాసెస్ను ఫాలో కావడం లేదని, కస్టమర్లపై వేసే ఛార్జీల్లో పారదర్శకత లేదని తెలిపింది. ఇప్పటికే ఉన్న గోల్డ్ లోన్ కస్టమర్లకు ఐఐఎఫ్ఎల్ తన సర్వీస్లను కొనసాగించొచ్చని ఆర్బీఐ పేర్కొంది. లోన్ రికవరీ ప్రాసెస్, కలెక్షన్స్ కొనసాగించొచ్చని తెలిపింది. ‘రెగ్యులేషన్స్ను ఉల్లంఘించడంతో పాటు, ఇటువంటి చర్యల వలన కస్టమర్లు తీవ్రంగా నష్టపోతారు
అని ఆర్బీఐ కామెంట్ చేసింది. కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్, ఆడిటర్లతో టచ్లో ఉన్నామని, ఈ లోపాలపై చర్చించామంది. లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీ ఇంకా చర్యలు మొదలు పెట్టలేదని, కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని తాజా రిస్ట్రిక్షన్లు పెట్టామని ఆర్బీఐ పేర్కొంది. స్పెషల్ ఆడిట్ చేపడుతున్నామని, ఇది పూర్తయ్యాక మరోసారి రివ్యూ చేపడతామని తెలిపింది.
