
న్యూఢిల్లీ: రిటైల్ షాపులు జీఎస్టీ తగ్గింపును "జీఎస్టీ డిస్కౌంట్"గా బిల్లులో స్పష్టంగా చూపించాలని, ప్రచారం చేయాలని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ సూచించింది. పోస్టర్లు, ఫ్లయర్లు, ప్రకటనలు (టీవీ, ప్రింట్, ఆన్లైన్) ద్వారా వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని రిటైలర్స్ అసోసియేషన్కు పంపిన లేఖలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) పేర్కొంది. కొత్త జీఎస్టీ రేట్లతో సుమారు 400 వస్తువులపై ధరలు దిగిరానున్నాయి.
సబ్బులు, షాంపూలు, కార్లు, ట్రాక్టర్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. బ్రెడ్, పాలు, పనీర్ వంటి ఆహార పదార్థాలపై జీఎస్టీ ఉండదు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పండుగ సీజన్లో అమ్మకాలు గణనీయంగా పెరగొచ్చని, రిటైలర్లు అమ్మకాల గణాంకాలను ట్రాక్ చేసి, వాటిని వివిధ ఛానళ్ల ద్వారా హైలైట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మార్పులతో వినియోగదారులతో పాటు రిటైల్ రంగం లాభపడుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.