
- సాధారణ నష్టం ఉన్న జిల్లాకు 5 కోట్లు: సీఎం రేవంత్
- వరద నష్టంపై అధికారులు రెండ్రోజుల్లో రిపోర్టు ఇవ్వాలి
- డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు ఇస్తం
- దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు రిపేర్లు
- 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా
- మంత్రులతో కలిసి.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు:వరదల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, పశువులు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తీవ్రంగా నష్టపోయిన జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద రూ. 10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లాల కలెక్టర్లకు రూ. 5 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలపై సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో రిపోర్టు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బృందం ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు అందజేస్తుందన్నారు. గతేడాది కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, ప్రస్తుత నష్టం అంచనాలపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.
భారీ వర్షాలు, వరద సహాయంపై సెక్రటేరియెట్లో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇటీవలి వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు రిపేర్లు చేపట్టడంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ల పునర్నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో అకాల వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉంటూ.. విపత్తుల సమయంలో తక్షణమే క్షేత్ర స్థాయికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులున్నా వాటిని వినియోగించడంలో అలసత్వం చూపడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినా కేంద్రం నుంచి సరైన సహాయం అందకపోవడంపై ఆరా తీశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం.. గతేడాదికి సంబంధించి రావాల్సిన నిధులు.. ప్రస్తుతం వ్యవసాయ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల పరిధిలో వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ రెండు నివేదికలను డిప్యూటీ సీఎం నేతృత్వంలోని బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అందజేస్తుందని తెలిపారు.
చిన్న నీటిపారుదల విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నరు
వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైస సీఎం స్పందిస్తూ చిన్న నీటి పారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆర్ఆర్ఆర్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకొని చిన్న నీటి వనరులకు రిపేర్లు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని సీఎం సూచించారు. గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా సంఘాలు ఉండేవని సీఎం గుర్తు చేశారు. నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు కొత్త ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. నివేదికపై మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆసుపత్రుల భవనాల పనులు వేగవంతం చేయడంతో పాటు వాటి ప్రారంభానికి తేదీలు నిర్ణయించాలని ఆ శాఖ కార్యదర్శి క్ట్రిసినా జడ్ చోంగ్తూను సీఎం ఆదేశించారు. కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, కె.ఎస్.శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి కె.మాణిక్ రాజ్, సీఎం ఓఎస్టీ వేముల శ్రీనివాసులు, డీజీపీ డాక్టర్ జితేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
82 మండలాల్లో పంట నష్టం
ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సీఎం తెలిపారు. నీట మునిగిన సబ్ స్టేషన్ల స్థానంలో కొత్త సామగ్రి, సామ ర్థ్యంతో కూడిన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయా లని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్కు సీఎం ఆదేశించారు. పురపాలక, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణ, ఏర్పాటుపై సమీక్ష నిర్వ హించి పరిష్కారంతో రావాలని సీఎస్ రామ కృష్ణారావుకు సీఎం సూచించారు.
చెంగిచర్ల తో పాటు జియాగుడ, అంబర్ పేటలోని స్లాటర్ హౌస్ల్లో హలాల్, జట్కా సక్రమంగా జరిగేలా చూడాలని.. అధునాతన యంత్రాలు వాడేలా చూడాలని.. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని, మాంసం విక్రేతలు అన్ని నిబంధనలు పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా,పశు సంవర్ధక శాఖలు సమగ్ర నివేదికలు రూపొందించి రెండు రోజుల్లో అందజేయాలని సీఎం ఆదేశించారు.