సోనియా సభ జరగకుండా మోదీ, కేసీఆర్‍ కుట్ర చేస్తున్రు : రేవంత్‍రెడ్డి

సోనియా సభ జరగకుండా మోదీ, కేసీఆర్‍ కుట్ర చేస్తున్రు : రేవంత్‍రెడ్డి
  • పరేడ్‍ గ్రౌండ్‍ ఇవ్వకుండా మోడీ, అమిత్‍ షా అడ్డుపడ్డరు
  • తుక్కుగూడ స్థలం దేవుడి మాన్యమని ఆఫీసర్లతో చెప్పించిన్రు
  • టీపీసీసీ చీఫ్ రేవంత్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు : సోనియాగాంధీ తెలంగాణలో అడుగుపెడుతుంటే..ప్రజలను కలవకుండా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‍ కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‍ రేవంత్‍రెడ్డి ఫైర్‍ అయ్యారు. ఈ నెల 17న కాంగ్రెస్‍ పార్టీ తుక్కుగూడ సభ నేపథ్యంలో బుధవారం వరంగల్‍ పార్లమెంట్‍ సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‍ 17న పరేడ్‍ గ్రౌండ్‍లో అమిత్‍ షా ముందస్తు ప్రొగ్రాం లేకున్నా..తాము గ్రౌండ్‍ అడిగామనే కారణంతో ప్రధాని మోదీ అప్పటికప్పుడు అమిత్‍ షాతో పరేడ్‍ గ్రౌండ్‍లో కార్యక్రమం పెట్టించారన్నారు.

గచ్చిబౌలి స్థలంలో సోనియా గాంధీ సభ పెట్టుకుంటామంటే కేసీఆర్​అనుమతి ఇవ్వలేదన్నారు. తుక్కుగూడలో దరఖాస్తు పెట్టుకుంటే.. దేవుడి మాన్యం భూములంటూ పర్మిషన్‍ ఇవ్వకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు. సోనియాగాంధీపై అభిమానంతో తుక్కుగూడలోని రైతులు తమ పంట పొలాలు పోయినా పర్వాలేదని 200 ఎకరాలు ఇచ్చారంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.   

ALSO READ: జీ20 సక్సెస్​పై మోదీకి ధన్యవాద తీర్మానం

కేసీఆర్‍, కేవీపీ బండారం బయటపెడ్తా

తన వెనకాల కేవీపీ రామచంద్రారావు ఉన్నాడని మంత్రి కేటీఆర్‍ ఆరోపిస్తున్నాడని.. తాను పీసీసీ అధ్యక్షుడయ్యాక ఏ సభ, సమావేశానికి కూడా కేవీపీని ఆహ్వానించలేదని రేవంత్​రెడ్డి అన్నారు. కేవీపీతో సీఎం కేసీఆర్‍కు ఉన్న అసలు సంబంధపు  ఫోటోలు బయటపెడ్తానన్నారు. ఆంధ్రవాళ్లను వ్యతిరేకులని మాట్లాడి..ఇప్పుడు కేవీపీ, చినజీయర్‍ స్వామి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడని విమర్శించారు. టిక్కెట్‍ కోసం అప్లై చేసుకున్న ఒక్కో లీడర్‍ 5 వేల మందిని తరలించాలని, ఉమ్మడి వరంగల్​నుంచి 2 లక్షల మంది సోనియా గాంధీ మీటింగ్‍కు తరలిరావాలని పిలుపునిచ్చారు.

పార్టీ వరంగల్‍ పార్లమెంట్‍ ఇన్​చార్జి రవీంద్ర ఉత్తమ్‍ దల్వి, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్​రాజేందర్​రెడ్డి, బండ్రు శోభారాణి, ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ మంత్రులు బలరాం నాయక్‍, సంభాని చంద్రశేఖర్‍, లీడర్లు వేం నరేందర్‍రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, కొమ్మూరి ప్రతాప్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్‍, జన్ను పరంజ్యోతి, కేఈఆర్‍ నాగరాజు పాల్గొన్నారు.