కాంగ్రెస్ గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం : రేవంత్ రెడ్డి

 

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి.. శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చారని చెప్పారు. ఈ గెలుపుతో సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశం వచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను అమలు చేయడానికి ఈ తీర్పునివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై మరింత బాధ్యతను ప్రజలు పెంచారని చెప్పారు. 

భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించారని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ విజయానికి పెద్దలందరి సహకారం ఉందన్నారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను అమలు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణలోని పేదలను అదుకోవడానికి ,తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మానవహక్కులను పునరుద్ధరిస్తుందన్నారు.