పుల్వామా టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్మీ తహతహలాడుతోంది. యుద్ధభూమిలో ఎత్తుగడలు, వ్యూహాలు అమలు చేయడానికి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తోపాటు నలుగురు లెఫ్టినెంట్ జనరల్స్ తో కమిటీ ఏర్పాటైంది. జవాన్లకు మానసిక స్థైర్యం కల్పిస్తూనే ప్రత్యర్థిపై దాడులు ఎలా చేయాలనే అంశాలను ఈ కమిటీ చర్చిస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ కు అమలు చేసే వ్యూహాలపై ఆర్మీ చీఫ్ కు ఇతర ఉన్నత విభాగాల అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. వీరిలో నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, మిలటరీ ఇంటెలిజెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, శ్రీనగర్ బేస్డ్ 15 మిలటరీ కార్ప్స్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్, మిలటరీ ఆపరేషన్స్ డీజీ లెఫ్టి నెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఉన్నారు.
ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్: జమ్మూ, కాశ్మీర్ లో టెర్రరిస్ట్ కార్యకాలాపాలను అరికట్టడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. శ్రీనగర్ లో స్థానిక యువత రూపంలో టెర్రరిస్టులు జరుగుతున్న రాళ్ల దాడులను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నారు.
లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్: ప్రస్తుతం నార్తర్న్ ఆర్మీ కమాండర్ గా ఉన్నారు. యుద్ధ వ్యూహాలు, ప్రణాళికలు వేయడంలో ఆయన దిట్ట అనే పేరుంది. గతంలో రణబీర్ నేతృత్వంలోనే సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
లెఫ్టినెంట్ జనరల్ కేజెఎస్ ధిల్లాన్: శ్రీనగర్ బేస్డ్ 15 కార్ప్స్ హెడ్ గా ఉన్నారు. కాశ్మీర్ లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైన్యం లో 15 కార్ప్స్ బేస్డ్ కీలకంగా ఉంది. గత వారమే ఆయన బాధ్యతలు చేపట్టారు. కాశ్మీర్ లో ఉండి పాకిస్థాన్కు అనుకూలంగా పనిచేస్తున్న తీవ్రవాదులపై దృష్టిసారించారు.
లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్: మిలటరీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. గూఢచర్యం చేయడం, పాకిస్థాన్ మద్దతుదారుల నుంచి కూడా సమాచారం సేకరించడంలో ప్రావీణ్యం ఉంది. సమాచార సేకరణలో కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, స్థానిక పోలీసుల మధ్య సమన్వయం చేయగలరు.
లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్: మిలటరీ ఆపరేషన్స్ డీజీగా గత ఏడాది బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్ చర్యలను చాలెంజ్గా తీసుకుని సత్వరమే వ్యూహాలు పన్నడంలో ఆయన దిట్ట. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు పాక్ రియాక్షన్స్ పసిగడుతూ సైన్యాన్ని అప్రమత్తం చేస్తున్నారు.