వెలుగు, స్పోర్ట్స్ డెస్క్: మస్తు టాలెంట్ ఉంది. నిలకడే లేదు. ఖతర్నాక్ షాట్లు కొట్టగలడు. కానీ, షాట్ సెలక్షనే బాగుండదు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు. కానీ, గుడ్డిగా నమ్మలేం. ధోనీ వారసుడిగా టీమిండియాలోకి వచ్చిన రిషబ్ పంత్ గురించి ఇన్నాళ్లూ ఉన్న అభిప్రాయాలివి. పంత్ ప్రతిభను పొగిడేవాళ్లంతా.. కానీ అంటూ ఏదో బలహీనతను గుర్తు చేస్తుంటారు. అయితే మాంచెస్టర్తో ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో తనలో ఏ చిన్న బలహీనతా లేదని రిషబ్ నిరూపించాడు. టాపార్డర్ బ్యాటర్లంతా ఫెయిలైన వేళ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. వాస్తవానికి రిషబ్ బ్యాటింగ్లో ముందు నుంచి ఎలాంటి బలహీనత లేదు. అతనిలో లోపించింది ఓపిక, ప్రశాంతతే. అనుభవం గడిస్తున్న కొద్దీ ఈ రెండు విషయాల్లో మెరుగయ్యాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడటం అలవాటు చేసుకొని ఇప్పుడు ‘పర్ఫెక్ట్ పంత్’ అయ్యాడు.
మార్పు వచ్చింది
మూడేండ్ల కిందట ఇదే గ్రౌండ్లో న్యూజిలాండ్తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో నిర్లక్ష్యమైన షాట్ ఆడి విమర్శలు ఎదుర్కొన్న పంత్ ఇప్పుడు అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు. నాడు క్రీజులో కుదురుకున్న తర్వాత శాంట్నర్ బాల్ను స్లాగ్ స్వీప్ షాట్ ఆడి డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చిన పంత్పై విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి పంత్ ‘షాట్ సెలక్షన్’ గురించి తరచూ జరుగుతూనే ఉంది. అతను నిర్భయమైన క్రికెటర్.. కాదు నిర్లక్ష్యమైన క్రికెటర్ అంటూ విశ్లేషకులు, ప్రజలు తిట్టిపోశారు. వాస్తవానికి 2019 వరల్డ్ కప్లో మొదట తనను ఎంపిక చేయనప్పటికీ పంత్ బాధ పడలేదు. ‘ఒక్క రాత్రిలో అంతా మారుతుందని నేను అనుకోను. నా వయసు 21 ఏళ్లే. నేను 30 ఏళ్ల వ్యక్తిలా ఆలోచించను. కాలంతో పాటు నా ఆలోచన తీరు కూడా మారుతుంది. పరిపక్వత వస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు పంత్ను చూస్తుంటే మూడేండ్ల కింద అతను చెప్పిన మాటలు నిజమయ్యాయి అనిపిస్తోంది. ఇందుకు కొంత సమయం పట్టింది. తనను ప్రశాంతంగా ఉంచేందుకు కెప్టెన్ రోహిత్ లాంటి కొందరు వ్యక్తులు అవసరం అయ్యారు.
బాధ్యత తెలుసు
19 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన పంత్ తన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు. అప్పటికి ధోనీ వారసుడిగా టీమిండియా తదుపరి కీపర్కు తీవ్ర పోటీ నెలకొనగా.. అందరినీ దాటుకుంటూ జట్టులోకి వచ్చాడు. కరోనా టైమ్లో ఆటకు బ్రేక్ వచ్చిన టైమ్లో రిషబ్ పలువురు క్రీడా ప్రముఖులతో ఆన్లైన్లో మాట్లాడాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఎలా ఉండాలో వాళ్ల నుంచి నేర్చుకున్నాడు. దాన్ని గ్రౌండ్లో చూపిస్తున్నాడు.
పాంటింగ్, ద్రవిడ్ ప్రభావం
పంత్ కెరీర్లో రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అయిన పాంటింగ్ గైడెన్స్లో పంత్ తన ఆలోచన తీరు మార్చుకున్నాడు. క్రికెట్తోనే ప్రపంచం ముగిసిపోదని.. ఆటను ఆస్వాదించాలని రిషబ్కు పాంటింగ్ సూచించాడు. నిజాయితీగా ఉండటం మరింత ముఖ్యమని చెప్పాడు. అలాగే, అండర్19 నుంచి ద్రవిడ్తో పంత్కు మంచి అనుబంధం ఉంది. జట్టులో పంత్ను సౌకర్యవంతంగా ఉంచితే ఫలితం వస్తుందని ద్రవిడ్కు తెలుసు. అందుకే మొన్నటి సౌతాఫ్రికా సిరీస్లో పూర్తిగా ఫెయిలైనా కూడా రిషబ్కు ద్రవిడ్ అండగా నిలిచాడు. అతని ప్రతిభపై నమ్మకం ఉంచాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టుతో పాటు ఆఖరి వన్డేలో అద్భుత సెంచరీలతో పంత్ కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్న రిషబ్కు మంచి ఫ్యూచర్ ఉంది. అతని వయసు 24 ఏండ్లే. ఇదే నిలకడ కొనసాగిస్తే తను కెప్టెన్గా టీమిండియాను నడిపించే అవకాశాలూ ఉన్నాయి.
