IND vs ENG 2025: ముచ్చటగా ముగ్గురు: లీడ్స్ టెస్టుల్లో పంత్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్

IND vs ENG 2025: ముచ్చటగా ముగ్గురు: లీడ్స్ టెస్టుల్లో పంత్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్

లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఓపెనర్ జైశ్వాల్ (101).. కెప్టెన్ శుభమాన్ గిల్ (144*) సెంచరీలు పూర్తి చేసుకోగా.. రెండో రోజు పంత్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన పంత్.. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. బషీర్ బౌలింగ్ లాంగన్ దిశగా సిక్సర్ కొట్టి 146 బంతుల్లో కెరీర్ లో 7 సెంచరీ చేశాడు. పంత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.  

ALSO READ | MLC 2025: డుప్లెసిస్ మెరుపు సెంచరీ.. 40 ఏళ్ళ వయసులో ప్రపంచ రికార్డ్ సమం చేసిన మాజీ సఫారీ కెప్టెన్

3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. తొలి గంటలో గిల్,  పంత్ జాగ్రత్తగా ఆడడంతో ఇంగ్లాండ్ కు వికెట్ ఏమీ రాలేదు. ఓ వైపు గిల్ డిఫెన్స్ కు పరిమితం కాగా.. మరో ఎండ్ లో పంత్ వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఇద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 500 పరుగుల దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరూ పట్టుదలగా ఆడడంతో ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 100 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 426  పరుగులు చేసింది.

క్రీజ్ లో గిల్ (144), పంత్ (112) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్స్ కు ఒక వికెట్ దక్కింది. మ్యాచ్ తొలి రోజు ఆటలో భాగంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (101) సెంచరీ చేశాడు. రాహుల్ 42 పరుగులు చేసి రాణించగా.. అరంగేట్ర టెస్ట్ లో సాయి సుదర్శన్ డకౌటయ్యాడు.