ఆర్ఎంపీ వైద్యం వికటించి ఒకరి మృతి

ఆర్ఎంపీ వైద్యం వికటించి ఒకరి మృతి
  • యాక్సిడెంట్​గా చిత్రీకరించి.. పరార్  
  • ఆందోళనకు  దిగిన  బాధిత కుటుంబం
  • ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

దహెగాం, వెలుగు: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఒకరు మృతిచెందగా, యాక్సిడెంట్​గా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన ఆసిఫాబాద్​జిల్లాలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్(38)​, పైల్స్​తో బాధపడుతుండగా చికిత్స కోసం శనివారం అదే మండలంలోని గెర్రె గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వినయ్​సర్కార్​ వద్దకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అదే రోజు సాయంత్రం అతడు ట్రీట్​మెంట్ చేయగా, వైద్యం వికటించి శ్రీనివాస్​ స్పృహ కోల్పోయాడు. 

దీంతో  పేషెంట్ ను కారులో తీసుకొని ఆర్ఎంపీ దహెగాం ఆస్పత్రికి బయలుదేరాడు.  మార్గం మధ్యలో కారు అదుపుతప్పడంతో పంట పొలాల్లో దిగబడింది. ఆర్ఎంపీ వెంటనే అంబులెన్స్ కు  కాల్​చేయగా.. రాగానే పేషెంట్​ను, కుటుంబ సభ్యులను అందులో ఎక్కించి అతను పరార్ అయ్యాడు. దహెగాం పీహెచ్​సీకి వెళ్లగా బెల్లంపల్లికి రెఫర్​చేశారు. అదే అంబులెన్స్​లో అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.  

యాక్సిడెంట్​గా చిత్రీకరణ

ఆర్ఎంపీ ఇంజక్షన్​చేయగానే వికటించి వెంటనే చనిపోవడం తెలిసి హడావిడిగా కారులో ఆస్పత్రికి తరలించాలని చెప్పి తీసుకెళ్లాడని మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.  కారును కావాలనే పంటపొలాల్లోకి దించాడని, అనంతరం అంబులెన్స్​లో ఎక్కించి ఆర్ఎంపీ పరారయ్యాడని ఆరోపించారు.  ఆర్ఎంపీ వినయ్ సర్కార్ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్​చేస్తూ  బెల్లంపల్లి ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.