పెళ్లి చూపులకు వెళుతూ యువకుడు దుర్మరణం

పెళ్లి చూపులకు వెళుతూ యువకుడు దుర్మరణం

పెళ్లి చూపులకు వెళుతున్న కుటుంబంలోని  ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లాపూర్ మండలం గుండంపల్లి కి చెందిన గజ్జేరి గణేష్ (30), భూపల్లి లక్ష్మీ (58) లు దుర్మరణం పాలయ్యారు. జగిత్యాల జిల్లాకు చెందిన గజ్జేరి గణేష్ దుబాయ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. తన పెళ్లి నిమిత్తం నాలుగు నెలలు సెలవుల్లో ఉన్న గణేష్ వధువును చూసేందుకు స్వగ్రామం గుండంపల్లి నుంచి తన పెద్దమ్మతో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నాడు. అయితే మెట్ పల్లి సమీపంలో ఎదురుగా ఉన్న సైకిల్ ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం జారీ పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న వీరిద్దరిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.