హైదరాబాద్ : శామీర్ పేటలో కారు బీభత్సం సృష్టించింది. సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి.. అవతలవైపు వెళుతున్న కారుపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నాగోల్ కు చెందిన కిషోర్ చారి (40), భారతి (37) సూదాన్ , తనీష్ (15) కలిసి కరీంనగర్ విహారాయాత్రకు వెళ్లి నాగోల్ కు కారులో వస్తున్నారు. శామీర్ పేట పరిధిలోకి రాగానే స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. కారు స్పీడ్ గా రావడంతో ఒక్కసారిగా పల్టీలు కొడుతూ ..ఎదురుగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న మరో కారుపై పడింది.
ఈ ప్రమాదంలో హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో కిషోర్, భారతి, తనీష్, అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారిని ట్రీట్ మెంట్ కోసం గాంధీ హస్పిటల్ కి తరలించిన పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.