రోడ్డు ప్రమాదం..భార్య, బిడ్డ ముందే నుజ్జునుజ్జయిన భర్త శరీరం

రోడ్డు ప్రమాదం..భార్య, బిడ్డ ముందే నుజ్జునుజ్జయిన భర్త శరీరం

మేడ్చల్ బస్ డిపో ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. లారీ కింద పడటంతో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జయ్యింది. మెదక్ జిల్లా మిర్జాపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ నగరంలోని మల్కాజిగిరిలో ప్లంబర్ పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం భార్య స్వప్న, కూతురుతో కలిసి మల్కాజిగిరి నుండి స్వగ్రామమైన మిర్జాపల్లికి స్కూటిపై బయలుదేరాడు. మేడ్చల్ వద్ద రాగానే తన కూతురుకు ఆకలి కావడంతో వాహనాన్ని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆపాడు. భార్య కూతురుకు టిఫిన్ ఇప్పించిన ప్రభాకర్.. బాత్రూంకి  వెళ్ళొస్తానని భార్యతో చెప్పి జాతీయరహదారిపై రోడ్డు దాటుతుండగా లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్ మృతదేహం నుజ్జునుజ్జయింది. భార్య కూతురు ముందే ప్రమాదం జరగడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు