వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. కింగ్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఈ మ్యాచ్తోపాటు ఐసీసీ టోర్నీ కీలక గేమ్ల్లో టీమిండియా చతికిలపడుతోంది. దీంతో విరాట్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాలనే వాదనలు వస్తున్నాయి. తాజాగా పాక్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ కూడా ఇదే వాదనను పైకి తెచ్చాడు. రోహిత్ను కెప్టెన్ను చేసేందుకు ఇదే సరైన సమయమని సూచించాడు.
‘విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ మెరుగైన సారథి అని నా అభిప్రాయం. 2018లో ఆసియా కప్ టైమ్లో రోహిత్ కెప్టెన్సీని గమనించా. స్టాండ్ బై కెప్టెన్గా అతడు జట్టును నడిపిన తీరు చాలా సహజంగా అనిపించింది. గత ఐదేళ్లలో ఒక్క పెద్ద మ్యాచ్లో టీమిండియా గెలవలేదు. అందుకే ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంత మంచి కెప్టెన్ అయినా టైటిల్ నెగ్గకపోతే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు. మీరు మంచి సారథి అయినా బౌలర్లు దాన్ని అమలు చేయకపోతే ఫలితాలు రావు. ఈ విషయంలో కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలి’ అని భట్ పేర్కొన్నాడు.