
- అమృత్ భారత్ స్కీం కింద రూ.37కోట్లు కేటాయింపు
- రైల్వే అధికారుల వరుస పర్యటనలతో పనుల్లో వేగం
- పెద్దపల్లితోపాటు మొదలైన కరీంనగర్, రామగుండం పనులు ఇప్పటికే పూర్తి
- పనుల్లో జాప్యంపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం
పెద్దపల్లి, వెలుగు: ఏడాది కింద మొదలైన పెద్దపల్లి రైల్వే స్టేషన్రినోవేషన్పనులు స్పీడందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం కింద పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రూ. 37 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి మోదీ వర్చువల్గా పనులు ప్రారంభించారు. అయితే ఏడాదయినా ఆశించిన స్థాయిలో పనులు పూర్తికాలేదు. పెద్దపల్లి రైల్వేస్టేషన్తోపాటు రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ స్టేషన్లలో కూడా అమృత్ భారత్ కింద పనులు స్టార్ట్ చేశారు. అందులో కరీంనగర్, రామగుండం పూర్తయ్యాయి. మంచిర్యాల స్టేషన్ కూడా పనులు పూర్తి కావస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్ పనుల్లో జాప్యం జరిగింది.
ఏడాది కింద మొదలైన పనులు
అమృత్ భారత్కింద రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా పెద్దపల్లి రైల్వేస్టేషన్ను గతేడాది అధికారులు కూల్చేశారు. మొదటగా రూ. 27 కోట్లు మంజూరు చేయగా.. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ. 37 కోట్లు శాంక్షన్ చేశారు. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైల్వే అధికారులు పనులనే వేగవంతం చేశారు. నాలుగు రోజుల కింద సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సందీప్మాథూర్పర్యటించి పనులను స్పీడ్గా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారుల వరుస పర్యటనలతో పనుల్లో వేగం పెరిగింది.
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
పెద్దపల్లి రైల్వేస్టేషన్ భవనాలను పూర్తిగా కూల్చేయడంతో ఏడాదిగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు, రెస్ట్ రూంలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. తాగునీరు, ఆహార పదార్థాల కోసం స్టేషన్ బయటకు రావాల్సి వస్తోంది.