యాదాద్రి, వెలుగు: ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి తెలిపారు. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల కోసం రూ. 485 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. భువనగిరిలోని జగదేవ్పూర్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రాప్ హాలీడే రాకుండా కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇప్పుడు మూసీ కింది భాగంలో పనులు చేయిస్తామని, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పై భాగంలో పనులు చేపడుతామని చెప్పారు.
కాల్వల కోసం సేకరించిన భూమికి త్వరలో పరిహారం అందిస్తామని ఆయన చెప్పారు. మూసీపై నిర్మించే బ్రిడ్జి పనుల కోసం రూ. 47 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో రూ. 1100 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడం కోసం సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించామన్నారు. అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు తంగెళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు.
