
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు నిర్వహించిన లోన్మేళాల్లో రూ.81,781 కోట్ల రుణాలు మంజూరు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. వీటిలో రూ.34,342 కోట్లను కొత్త అకౌంట్లకు జారీ చేశామని ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. బ్యాంకుల దగ్గర తగినంత లిక్విడిటీ ఉందని, ఎంఎస్ఎంఈలకు బకాయిలన్నీ చెల్లించాలని ఆదేశించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
చిన్న పరిశ్రమలకు మరింత లిక్విడిటీని అందుబాటులోకి తేవడానికి బిల్ డిస్కౌంటింగ్ సదుపాయాన్ని అందించాలని బ్యాంకులను ఆదేశించినట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రావాల్సిన రూ.40 వేల కోట్లను దీపావళికి ముందే ఇచ్చేస్తామని నిర్మల తెలిపారు.