
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇవాళ్టితో రికార్డులకెక్కనుంది. నేటితో సమ్మె 43 రోజులకు చేరుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో జరిగిన సకల జనుల సమ్మె 42 రోజులు జరిగింది. రాష్ట్రంలో చాలా రోజుల పాటు జరిగిన సమ్మెగా ఇప్పటి వరకు సకల జనుల సమ్మెకు గుర్తింపు ఉండగా… ఇప్పుడీ రికార్డును ఆర్టీసీ సమ్మె బ్రేక్ చేసింది. 2001లోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. అప్పట్లో సమ్మె 24 రోజులు కొనసాగింది. ఈ రోజుతో 43వ రోజులోకి అడుగుపెట్టిన సమ్మె తెలంగాణ చరిత్రలో సుదీర్ఘకాలంపాటు జరిగిన సమ్మెగా రికార్డులకెక్కబోతోంది.
ఇవాళ(శనివారం) నిరాహార దీక్షలకు దిగనున్నట్టు ఆర్టీసీ జేఏసీ ఇది వరకు ప్రకటించగా ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకుంది. ‘బస్ రోకో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ 144 సెక్షన్ ను విధించారు.