ఊర్లకు తరలుతున్న.. ఎలక్షన్​ లిక్కర్!

ఊర్లకు తరలుతున్న.. ఎలక్షన్​ లిక్కర్!
  •     ఒక్కో షాపునకు  రూ.కోటి దాకా అడ్వాన్సులు
  •     బెల్టుషాపులు, నమ్మకస్తుల ఇండ్లలో డంపులు
  •     ఆఫీసర్లు రైడ్​ చేస్తే బయటపడే చాన్స్​

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లోని ఓ ఇంట్లో లిక్కర్​డంప్​ ఉన్నట్లు సమాచారం అందడంతో గత మంగళవారం పోలీసులు రైడ్​చేశారు. రూ.20వేల లిక్కర్​బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. సదరు ఇల్లు స్థానికంగా బెల్ట్​షాపు నిర్వహిస్తున్న జంగిపల్లి నూతన్​కుమార్​ది. ఎన్నికల నేపథ్యంలో లిక్కర్​ ఇంట్లో స్టోర్​చేసినట్లు తెలిసింది. పక్క ఫొటోలో కనిపిస్తున్న లిక్కర్​ బాటిల్స్​ అవే..

మహబూబ్​నగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొందరు బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకూ గ్రౌండ్​వర్క్ చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఓటర్లకు పంచేందుకు వీలుగా వైన్​షాపుల్లో భారీ మొత్తంలో లిక్కర్ బ్లాక్​ చేస్తున్నారు. వీలును బట్టి ఊళ్లకు తరలించి బెల్టుషాపుల్లో, నమ్మకస్తుల ఇండ్లలో, రైస్​మిల్లుల్లో, గోడౌన్లల్లో, వ్యవసాయక్షేత్రాల వద్ద డంప్​ చేస్తున్నారు.  

ఇందుకోసం కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక్కో షాపుకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి దాకా అడ్వాన్స్​ చెల్లించినట్లు సమాచారం. ఎలక్షన్​ నోటిఫికేషన్  రావడానికి రెండు మూడు రోజుల ముందే చాలాచోట్ల అడ్వాన్సులు ఇచ్చేయగా,  లిక్కర్​ను కూడా సేఫ్​జోన్లకు తరలించినట్లు తెలుస్తోంది. 

పాలమూరులోనే రూ.40 కోట్ల లిక్కర్ బ్లాక్​..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది రోజులుగా రూలింగ్​ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలు లిక్కర్​అడ్వాన్స్​ బుకింగ్​పై ఫోకస్ పెట్టారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​లో 18 నుంచి 22 వైన్​షాపులు ఉండగా, ఇప్పటికే ఒక్కో దానికి రూ.80 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు అడ్వాన్సులు చెల్లించారు. పెద్ద మండలాల్లోని వైన్​షాపులకు రూ.1.40 కోట్ల వరకు చెల్లించినట్లు షాపుల్లోని సిబ్బంది ద్వారా తెలిసింది. 10 రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు రూ.40 కోట్ల లిక్కర్ ​బుక్ ​చేసినట్లు సమాచారం.

నాలుగు బ్రాండ్లకు చెందిన చీప్​ లిక్కర్ క్వార్టర్ బాటిల్స్ ను అధికంగా బుక్​చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అత్యంత నమ్మకస్తుల ద్వారా అడ్వాన్స్ మనీని వైన్​షాపుల నిర్వాహకులకు చేర్చారు. కొన్న లిక్కర్​ను కొన్నట్లు వైన్ షాపుల గోదాముల్లోనే స్టాక్ ​చేశారు. మరికొందరు గ్రామాల్లోని బెల్టుషాపుల్లో, నమ్మకస్తులైన లీడర్లకు చెందిన రైస్ మిల్లులు, గోదాములు, వ్యవసాయ పొలాల్లో డంప్​చేసినట్లు తెలిసింది. ప్రచారాలు జోరందుకోగానే పంపిణీ షురూ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. దసరా పండుగ నాడు ఓటర్లకు చుక్క.. ముక్క అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.

బెల్టు షాపులదే ‘కీ’రోల్

కొన్నిచోట్ల గోదాములు, వ్యవసాయ క్షేత్రాల్లో డంప్​చేసిన ఎలక్షన్ లిక్కర్​ను రోజుకు కొంత గ్రామాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఊరిలో 8 నుంచి 10 బెల్టు షాపులు ఉన్నాయి. వాటికి ఆ లిక్కర్​ను షిప్ట్ ​చేస్తున్నారు. వైన్స్, బెల్ట్​షాపుల యజమానులు ఎక్కువ మంది రూలింగ్​ పార్టీకి చెందిన వారే కావడంతో ప్రాసెస్​ఈజీ అవుతోంది. రెగ్యులర్ ​బిజినెస్ దెబ్బ తినకుండా చూసుకుంటూనే, లీడర్లు చిట్టీలు రాసి పంపించిన వ్యక్తికి లిక్కర్ అందజేస్తున్నారు. ఇందుకోసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. మరో నెలన్నర రోజులు లిక్కర్​పంపిణీలో బెల్టు షాపులు‘కీ’ రోల్ ​పోషించనున్నాయి.

చూసీ చూడనట్లు ఆఫీసర్లు

కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటివరకు అభ్యర్థులను ఫైనలైజ్​ ​చేయలేదు. ప్రకటించడానికి వారం, పది రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీల లీడర్లు వచ్చేలోపే పెద్ద మొత్తంలో లిక్కర్ ​స్టాక్ చేసి పెట్టుకోవాలే ప్లాన్​లో బీఆర్ఎస్ ​లీడర్లున్నారు. నామినేషన్​ వేశాక మరో దఫా కొంటామని ఇప్పటికే వైన్స్​ నిర్వాహకులతో మాట్లాడు కున్నారు. పెద్ద మొత్తంలో లిక్కర్ ఎవరికీ అమ్మరాదని, తామే స్టాక్​ మొత్తం కొంటామని చెబుతున్నట్లు తెలిసింది.

వైన్స్​ నుంచి గ్రామాలకు పెద్ద మొత్తంలో లిక్కర్ తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవట్లేదు. సరిహద్దుల వద్ద నిఘా పెట్టారే తప్ప, రూరల్ ఏరియాలపై దృష్టి పెట్టట్లేదు. లిక్కర్​తరలింపుకు కొందరు ఆఫీసర్లు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారిని గత బుధవారం ఈసీ కూడా హెచ్చరించింది. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో లిక్కర్​తరలింపు ఆగలేదు.