
ఖమ్మం/ కూసుమంచి/ ముదిగొండ, వెలుగు: జిల్లాలో విలువైన ప్రభుత్వ, దేవాలయ భూములను కొందరు అధికార పార్టీ నేతలు ఆక్రమించేస్తున్నారు. కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ, ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో రూ.కోట్ల విలువైన భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట సర్వే నెంబర్ 219 లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా నిర్మించిన ఖమ్మం – సూర్యాపేట హైవేను ఆనుకొని ఉండడంతో ప్రస్తుతం దాని విలువ రూ.3 కోట్లకు చేరింది. ఇటీవల ప్రభుత్వం ఇక్కడ ఎలక్ట్రికల్ కార్లు, బైక్లు చార్జింగ్ పెట్టుకునేలా చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్థలం మీద కన్నేసిన అధికార పార్టీ లీడర్ ఒకరు 10 రోజుల క్రితం రాత్రికి రాత్రే అక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయ్యప్ప మాలధారులు పది రోజుల నుంచి రెగ్యులర్ గా వెళ్లి పూజలు చేస్తున్నారు.
అధికారులు, పోలీసులకు కంప్లైంట్..
కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ని కబ్జా చేసేందుకు ప్లాన్ వేశారని గుర్తించిన కొందరు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో 24 గంటల్లో విగ్రహాన్ని తొలగించాలంటూ కూసుమంచి తహసీల్దార్, ఎస్ఐ అక్కడ పూజలు చేస్తున్న వారికి చెప్పారు. ఇక ఈ విగ్రహ ఏర్పాటు గురించి స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి కొందరు గ్రామస్తులు చెప్పగా, ఆయన కూడా ఆ లీడర్లను పిలిపించి కోప్పడ్డట్టు తెలిసింది. దేవాలయానికి స్థలం కావాలంటే తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వాలే తప్ప రాత్రికి రాత్రి ఎందుకు విగ్రహం పెట్టారని నిలదీశారు. గ్రామస్తులు మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే చెప్పినా, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. 10 రోజుల నుంచి తహసీల్దార్ సెలవులో ఉండగా, ఇన్చార్జి తహసీల్దార్ మాత్రం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగిస్తామని చెబుతున్నారు. అయితే స్థానిక లీడర్ల ఒత్తిడి కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ కబ్జాకు ప్లాన్ చేసిన చోటా లీడర్ ఇప్పటికే అదే గ్రామంలో చెరువు శిఖం భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
మునిగేపల్లిలో దేవాదాయ భూమి..
ఇక కూసుమంచి మండలం మునిగేపల్లిలో రెండెకరాల దేవాదాయ భూమి అన్యాక్రాంతమైంది. ముదిగొండ మండలం మాధాపురంలోని హనుమాన్ ఆలయానికి చెందిన దేవుడి మాన్యం మునిగేపల్లి రెవెన్యూలో 153/ఉ లో 2 ఎకరాల 10 గుంటలు ఉంది. 1994–95లో ఉన్న పహాణీల్లో దేవుడి భూములుగానే ఉండగా, 2009–10 నాటికి ఇద్దరి పేర్ల మీదకు బదిలీ అయింది. ప్రస్తుతం ధరణిలో కూడా ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూపిస్తోందని కొందరు గ్రామస్తులు ముదిగొండ తహసీల్దార్కు కంప్లైంట్ చేశారు. దేవాలయం ఒక మండలంలో ఉండడం, మన్యం భూమి మరో మండలంలో ఉండడంతో ఈ కంప్లైంట్ పై ఇంత వరకు ఎంక్వైరీ కూడా చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. అయితే తాము ఫిర్యాదు చేసినా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.