- ములుగు కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
- దివ్యాంగులకు ప్రత్యేక పోర్టల్, అంగన్వాడీల్లో నర్సరీ ఎడ్యుకేషన్ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : గ్రామీణ ప్రాంత మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి అవసరమైన సాయాన్ని ప్రభుత్వం అందిజేస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం మహిళా శక్తి క్యాంటిన్ను ప్రారంభించారు. అనంతరం ములుగు నుంచి పత్తిపల్లి వరకు బీటీ రోడ్డు, మంత్రి క్యాంప్ ఆఫీస్ ఎదుట ఓపెన్ జిమ్ను మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాంనాయక్, కలెక్టర్ దివాకర్తో కలిసి ప్రారంభించి, దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలను అందిస్తున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మీ – సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్లు, డెయిరీ ఫాంలు, సోలార్ లైట్స్ నిర్వహణలో మహిళలను సైతం భాగస్వాములు చేస్తామన్నారు.
మహిళా శక్తి క్యాంటీన్లలో క్వాలిటీ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. దివ్యాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక పోర్టల్ను రూపొందించి ఎవరు ఏ ఉద్యోగానికి అర్హులో చూసి అవకాశాలు కల్పిస్తామన్నారు.
అంగన్వాడీల్లో నర్సరీ బోధన
అంగన్ వాడీ సెంటర్లలో చిన్నారులకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. అంగన్ వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఏర్పడిందని, ఆగస్ట్లో రైతు రుణమాఫీ పూర్తయ్యాక అభివృద్ధి వైపు అడుగులు పడుతాయన్నారు. అంగన్వాడీ కాంట్రాక్టర్లు క్వాలిటీతో కూడిన గుడ్లు, సరుకులు సరఫరా చేయాలని, లేకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.