
- పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో మాట్లాడారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఇరాన్ లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే చెర్నోబిల్ తరహా విపత్తుకు దారితీస్తుందని రష్యా న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ హెడ్ కూడా గురువారం హెచ్చరించారు.
ఇజ్రాయెల్ ఈ ప్లాంట్ పై దాడి చేసిందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒకరు అంతకు ముందు చెప్పారు. అనంతరం ఆ ప్రకటనను ఖండించారు. బుషెహర్ ప్లాంట్పై దాడిని తాను ధ్రువీకరించలేనని, తిరస్కరించలేనని పేర్కొన్నారు. కాగా, బుషెహర్ అనేది ఇరాన్ లో పనిచేస్తున్న ఏకైక న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీన్ని రష్యా నిర్మించింది.
ఇజ్రాయెల్ కు సైనిక సాయం చేయొద్దు..
రష్యా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ సెర్గీ ర్యాబ్కోవ్ కూడా అమెరికాను హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ కు ప్రత్యక్ష సైనిక సహాయం చేయొద్దని కోరారు. ఆ దేశానికి అమెరికా సైనిక సాయం చేస్తే మొత్తం పరిస్థితులు దారుణంగా మారుతాయని తెలిపారు. ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రపంచం మొత్తం విపత్తుకు దగ్గరైనట్టే అని జఖరోవా కూడా పేర్కొన్నారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై ఇప్పటికే దాడులు జరుగుతున్నాయని, యునైటేడ్ నేషన్స్ వాచ్ డాగ్ ఇప్పటికే నష్టాన్ని గుర్తించిందని వివరించారు. ‘‘ప్రపంచం మొత్తం ఏం చేస్తుంది. పర్యావరణవేత్తలు ఎక్కడికి పోయారు. తాము చాలా దూరంలో ఉన్నామని, రేడియేషన్ తమను చేరుకోలేదని వారు భావిస్తున్నారో నాకు తెలియదు. ఫుకుషిమాలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి”అని ఆమె వెల్లడించారు.