
- విదేశాలకెళ్లినప్పుడు..రాజకీయాలు ముఖ్యమా?
- రాహుల్కు ఇన్డైరెక్ట్గా జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
కేప్టౌన్ : అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ చేస్తున్న పొలిటికల్ కామెంట్లకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘విదేశాలకు వెళ్లినప్పుడు రాజకీయాల కన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉంటాయి”అని రాహుల్ పేరు ప్రస్తావించకుండా జైశంకర్ కామెంట్లు చేశారు. విదేశాల్లో ఉన్నప్పుడు తాను రాజకీయాలు చేయనని, కానీ ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం విమర్శలకు ధీటుగా జవాబిస్తానని చెప్పారు. ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత కేప్ టౌన్ లో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లతో చిట్చాట్ చేశారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండా.. ‘‘అమెరికా పర్యటనకు వచ్చిన ఓ వ్యక్తి ఇండియన్ పాలిటిక్స్పై చేస్తున్న విమర్శలపై మీ అభిప్రాయం ఏంటి?”అని ఓ ఎన్ఆర్ఐ ప్రశ్నించాడు. దీనికి మంత్రి స్పందిస్తూ.. దేశ ప్రతిష్టను నిలబెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందన్నారు. విదేశాల్లో ఉన్నప్పుడు దేశ రాజకీయాలకంటే ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
‘‘నేను విదేశాల్లో ఉన్నప్పుడు నా గురించే మాత్రమే మాట్లాడుతా. దేశ రాజకీయాల గురించి మాట్లాడను. ఇండియాలో మాత్రం విమర్శలకు ధీటుగా బదులిస్తా. ఇండియా వెళ్లాక ఏంచేస్తానో మీరే చూస్తారు” అంటూ జైశంకర్ కామెంట్ చేశారు.