
గంటకు 360 కిలోమీటర్ల వేగాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అది పట్టాలపై పరుగుపెడుతున్నప్పుడు మనం పక్కనుంటే ఆ స్పీడ్కు ఎగిరిపోయినా ఎగిరిపోతాం. ఈ స్పీడ్ జపాన్ కొత్తగా తయారు చేసిన బుల్లెట్ రైలు ఎన్700ఎస్ది. ఎస్ అంటే ‘సుప్రీమ్’ అని అర్థం. దాని పేరుకు తగ్గట్టే స్పీడ్లోనూ సుప్రీమ్ అయిపోయిందా బుల్లెట్ రైలు. టోక్యో ఒలింపిక్స్ నాటికి దానిని పట్టాలపైకి ఎక్కించాలని భావిస్తున్న జపాన్, శుక్రవారం పట్టాలపై టెస్టు చేసింది. ఆ టెస్ట్ రన్లో 360 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని రికార్డు సృష్టించింది. మైబారా–క్యోటో లైన్లో దీనిని పరీక్షించారు.
షింకాన్సెన్ బుల్లెట్ రైళ్లలో ఇదీ ఓ వెర్షన్. ఇప్పుడున్న డిజైన్లతో పోలిస్తే దీని డిజైన్ స్పెషల్ అని, ఇప్పటి బుల్లెట్ ట్రైన్ల కన్నా తేలికగా ఉంటుందని, ఎక్కువ స్పీడ్తో దూసుకెళ్లినా, తక్కువ ఇంధనాన్ని వాడుకుంటుందని దీనిని తయారు చేసిన సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ అలియాస్ జేఆర్ సెంట్రల్ చెప్పింది. భూకంపాలొచ్చినా తట్టుకునేలా భద్రతా ఫీచర్లు అందులో ఉన్నాయంది.
షింకాన్సెన్ ప్రాజెక్టులో భాగంగా కంపెనీ సుమారు ₹15,260 కోట్లు (220 కోట్ల డాలర్లు) ఖర్చు చేస్తోంది. జూన్ వరకు ట్రైన్ స్పీడ్పై కంపెనీ టెస్టులు చేస్తుంది. జేఆర్ సెంట్రల్ టెస్ట్ చేస్తున్న ఇంకో బుల్లెట్ ట్రైన్ ఆల్ఫా ఎక్స్ కూడా 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. దానిని 2030 నాటికి పట్టాలెక్కించేందుకు జపాన్ సెంట్రల్ రైల్వే కృషి చేస్తోంది. టోక్యో నుంచి హొక్కైడో మధ్య అది సేవలందిస్తుంది.