డిసెంబర్​ 27 రాత్రి 11 గంటలకు శబరిమల ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడంటే..

డిసెంబర్​ 27 రాత్రి 11 గంటలకు శబరిమల ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడంటే..

భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం దేవాలయం తలుపులు ఈ సంవత్సరం (2023) మండల మహోత్సవం పూర్తయిన తర్వాత  డిసెంబర్​ 27న  రాత్రి 11:00 గంటలకు మూసివేస్తున్నారు.   మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం తలుపులు డిసెంబర్​ 30న సాయంత్రం 5:00 గంటలకు తెరవబడతాయి.  మకరవిళక్కు (జ్యోతి దర్శనం)  2024 జనవరి 15న   సాయంత్రం (6:36:45) దర్శనం కలుగుతుంది. 

మకరవిళక్కు మహత్వష్టం(2024) పూర్తయిన తర్వాత శబరిమల సన్నిధానం 2024 జనవరి ​ 20న ఉదయం  6:30  మూసివేయబడుతుంది.  ఆ తర్వాత  భక్తులను దర్శనానికి అనుమతించరు.

శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి ఏటా భారీగా భక్తులు పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బాగా రద్దీగా ఉండటంతో కొంతమంది స్వామిని దర్శనం చేసుకోకుండానే తిరిగి ప్రయాణమయ్యారు.   కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచి భారీగా అయ్యప్పమాలధారులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దీంతో 41 రోజులపాటు ఆలయప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

 మండల పూజ

శబరిమల అయ్యప్ప ఆలయంలో 41 రోజులపాటు మండల పూజలు జరిగాయి.  మండల పూజ ముగింపు ఉత్సవం బుధవారం ( డిసెంబర్​ 27)న జరగనుంది.  ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామి వారి ఆలయాన్ని మూసివేస్తామని ప్రధాన పూజారి ,ట్రావెన్‌కోర్‌ ‌ బోర్డ్‌ అధికారులు తెలిపారు. 

మళ్లీ తిరిగి తెరిచేది ఎప్పుడంటే..?

శబరిమలలో మండల పూజలు ముగిసిన తర్వాత మకరజ్యోతి ఉత్సవాలు జరగడం అనవాయితీ. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకరజ్యోతి ఉత్సవాల కోసం హరిహర తనయుడి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చే ఏడాది  జనవరి 15న మకరవిలక్కు పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులతో నిండిపోతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేవస్థానం బోర్డు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. మకరజ్యోతి ఉత్సవాలు ముగిసిన తర్వాత జనవరి 20న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు. దీంతో శబరిమల వార్షిక యాత్రా సీజన్‌ ముగుస్తుంది.