
కేరళలో భారీగా కురుస్తున్న వర్షాలతో పంబానదికి వరద ఉధృతి పెరిగింది. ఈ వరద ఉధృతి ప్రభావం శబరిమల ఆలయ దర్శనాలపై పడింది. వరద పెరగడంతో శబరిమల ఆలయంలోకి భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ స్థానిక కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద తీవ్రత తగ్గిన తరువాత.. పరిస్థితిని బట్టి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరదల ధాటికి కక్కి రిజర్వాయర్ కూడా పూర్తిస్థాయిలో నిండింది. ఏ క్షణంలో అయినా రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దాంతో దిగువ ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గత కొన్ని రోజుల నుంచి పంబానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేరళలోని నదులకు వరద చేరింది. వారం రోజుల క్రితమే శబరిమల ఆలయాన్ని తెరిచారు. కానీ, ఇంతలోనే వరదలు రావడంతో మరోసారి మూతపడింది.