ఆ బాబు చనిపోయి కదిలించాడు : హైదరాబాద్ సిటీలో.. 22 వేల మ్యాన్ హోల్స్ కు గ్రిల్స్ పెట్టారు

ఆ బాబు చనిపోయి కదిలించాడు : హైదరాబాద్ సిటీలో.. 22 వేల మ్యాన్ హోల్స్ కు గ్రిల్స్ పెట్టారు

భాగ్యనగరం.... కాస్త రెండు చినుకులు పడితే చాలు బాధిత నగరంగా మారిపోతుంది.  ఎప్పుడు వర్షాలు పడినా మ్యాన్ హోల్స్ లో పడి పిల్లలు గల్లంతవుతున్నారు.  అయినా ఇటు అధికారులకు గాని..ప్రజా ప్రతినిథులకు కనువిప్పు కలగలేదు. కూకట్ పల్లి ప్రగతి నగర్ లో  నాలుగేళ్ల బాలుడు మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయి మరణించిన ఘటన హైదరాబాద్ నగర వాసులను కలచివేసింది.  వరద నీరును తొలగించాలనే ఆతృత, తొందరపాటులో అవగాహనలేమితో పౌరులు చేసే చర్యలు ప్రాణాలనే బలిగొంటున్నాయి. నగరంలోని మ్యాన్‌హోల్స్‌ మానవ మృత్యుకుహరాలు కావొద్దనే ఆశయంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ వైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే.. మరో వైపు రక్షణ చర్యలు చేపట్టారు. గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న 22 వేల మ్యాన్‌హోల్స్‌కు అధికారులు సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేసి..వాటిపై రెడ్‌ మార్కును వేశారు. అంతేకాకుండా ‘ఇక్కడ మ్యాన్‌హోల్‌ ఉంది.. జాగ్రత్త!’ అంటూ అనేకచోట్ల సూచికలు కూడా ఏర్పాటు చేశారు. మ్యాన్‌హోల్స్‌ వద్ద సమస్యలు ఉన్నట్లయితే జలమండలి, జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బందే స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరిస్తారని కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ చెప్పారు. అనాలోచితంగా మ్యాన్‌హోల్స్‌ మూతలు తీస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నగరంలోని రోడ్లపై ఉన్న మ్యాన్ హోళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ సూచనలు చేసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న తరుణంలో జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మాన్ సూన్ సేఫ్టీ టీమ్, సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ వాహనాలను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. వీటితో పాటు ఎయిర్ టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మరో వైపు మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు(సిల్ట్)ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.

సెక్షన్‌కు ఒక బృందం ఏర్పాటు 

మ్యాన్ హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేశారు. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. చోకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటి కప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. దగ్గరలోని వార్డు కార్యాలయాల్లోనూ నేరుగా సంప్రదించవచ్చు.

చట్టం ఏం చెబుతోంది 

ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా HMWSSB ACT – 1989, సెక్షన్ 74 ప్రకారం నేరం. దీన్ని అతిక్రమించి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముంది.

కార్మికులకు శిక్షణ 

పారిశుద్ధ కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై వారికి జలమండలి ఏటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో వారికి ఎస్వోపీ మార్గదర్శకత్వాల ప్రకారం.. భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుద్ధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై శిక్షణ ఇస్తోంది. అంతే కాకుండా పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్సపైనా అవగాహన కల్పిస్తుంది.