ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీ ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్ 1’ ట్రైలర్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. 3 నిమిషాల 46 సెకన్స్ ఉన్న ఈ లెంగ్తీ ట్రైలర్లో 2 నిమిషాల 17 సెకన్స్ తర్వాత కనిపించాడు ప్రభాస్. ‘దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో.. విడదీయలేని స్నేహం ఉండేది’ అంటూ ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ చిన్నప్పటి పాత్రలతో ట్రైలర్ మొదలైంది. ‘నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా..
నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తా’ అంటూ చిన్నప్పటి ప్రభాస్ పాత్రతో చెప్పించిన డైలాగ్తో కథమేటో రివీల్ చేశాడు ప్రశాంత్ నీల్. వందల ఏళ్ల క్రితం ఖాన్సార్ అనే అడవిని క్రూరమైన బందిపోట్లు ఓ కోటగా మార్చుకుని పాలిస్తుంటారు. ప్రస్తుతం ఆ కోటకు దొరైన రాజమన్నార్ (జగపతిబాబు) తన కొడుకు వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్)ను తన సామ్రాజ్యానికి వారసుడిగా చేయాలనుకుంటాడు. కానీ తను కోటలో లేనప్పుడు వరదను చంపాలని శత్రువులు ప్లాన్ చేస్తారు. ఇందుకోసం రష్యన్, సెర్బియన్ ప్రైవేటు సైన్యాలను దింపుతారు.
శత్రువులంతా చుట్టుముడుతుంటే అప్పుడు వరదరాజ్ ఫ్రెండ్ అయిన దేవ (ప్రభాస్) రంగంలోకి దిగుతాడు. తన ఫ్రెండ్ని టచ్ చేయడానికి ప్రయత్నించిన వాళ్లందరినీ ఊచకోత కోస్తాడు. చిన్న చిన్న ముక్కలు కాదు.. కళ్ల ముందు ఉన్న సామ్రాజ్యమంతా తనకే కావాలంటాడు వరదరాజ మన్నార్. ఇదీ ట్రైలర్లో చూపించిన కథ. ఆ తర్వాత ఏం జరిగింది.. అనేది సినిమాలో చూడాలి. చివర్లో.. ‘ప్లీజ్.. ఐ కైండ్లీ రిక్వెస్ట్’ అంటూ యాక్షన్ సీన్స్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ట్రైలర్కు హైలైట్గా నిలిచింది.
ఎప్పటిలాగే తన మార్క్ యాక్షన్ సీన్స్తో ట్రైలర్ కట్ చేశాడు ప్రశాంత్ నీల్. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ సింహా, ఈశ్వరి రావ్, టిన్నూ ఆనంద్, శ్రియ రెడ్డి, రామచంద్రరాజు, జాన్ విజయ్, మైమ్ గోపి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. ఈనెల 22న సినిమా విడుదల కానుంది.